ప్రతి భూమికీ యూనిక్‌ నంబర్‌

ABN , First Publish Date - 2021-10-29T09:16:07+05:30 IST

ప్రతి భూమికీ యూనిక్‌ నంబర్‌

ప్రతి భూమికీ యూనిక్‌ నంబర్‌

సర్వే నంబర్ల స్థానంలో ఎల్‌పీఎన్‌, ఎల్‌పీఎం

రీసర్వేతో మారనున్న భూమి రికార్డులు


అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): సమగ్ర భూ సర్వేతో ప్రతి రైతు భూమికి కొత్తగా 11 లేదా 12 అంకెల విశిష్ట సంఖ్య ఇవ్వనున్నారు. భూముల సర్వే నంబర్ల స్థానంలో ఎల్‌పీఎన్‌, ఎల్‌పీఎం నంబర్లు పట్టాదారు పాస్‌పుస్తకాల్లో కనిపించనున్నాయి. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) గురువారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ భూమి హక్కులు, పట్టాదార్‌ పాస్‌ పుస్తకం చట్టం (ఆర్‌ఓఆర్‌)-1989 ప్రకారం సమగ్ర భూ సర్వే తర్వాత భూమి రికార్డులను తాజా పరచనున్నారు. దీనివల్ల భూమి సర్వే, సబ్‌ డివిజన్‌ నంబర్ల స్థానంలో కొత్తగా ల్యాండ్‌ పార్సిల్‌ నంబరు (ఎల్‌పీఎన్‌), ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎం)ల వివరాలను భూమి రికార్డుల్లో చేరుస్తారు. వీటితోపాటు ప్రతి భూమికి 11 లేదా 12 అంకెల విశిష్ట సంఖ్య (యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌-యూఐఎన్‌) జారీ చేస్తారు. భూమి రకం, స్వభావం కూడా రికార్డుల్లో పొందుపరచనున్నారు. ఈ వివరాలను తాజాగా భూమి రికార్డుల్లో పొందుపరచడం కోసం ఆర్‌ఓఆర్‌ చట్టంలోని సెక్షన్‌ 4(2) కింద నోటిఫై చేశారు. రాష్ట్రమంతా రీ సర్వే జరగనుంది కాబట్టి, రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ భూమి రికార్డుల్లో పైన పేర్కొనే మార్పులు కనిపిస్తాయి. ఇదే విషయాన్ని రైతుల దృష్టికి తీసుకెళ్లడం కోసం సీసీఎల్‌ఏ నోటిఫికేషన్‌ ఇచ్చారు. గ్రామాల వారీగా అధికారికంగా రైతులకు తెలియజేసేలా నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. 

Updated Date - 2021-10-29T09:16:07+05:30 IST