సంఘాల పేరుతో విధులకు డుమ్మాకొడితే తాటతీస్తా!
ABN , First Publish Date - 2021-12-30T08:34:33+05:30 IST
ఏజెన్సీలో ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు సంఘాల పేరుతో విధులకు డుమ్మాకొడితే తాటతీస్తానని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున హెచ్చరించారు.

ఏజెన్సీ ప్రభుత్వ ఉద్యోగులకు కలెక్టర్ హెచ్చరిక
పాడేరు (విశాఖపట్నం జిల్లా), డిసెంబరు 29: ఏజెన్సీలో ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు సంఘాల పేరుతో విధులకు డుమ్మాకొడితే తాటతీస్తానని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున హెచ్చరించారు. బుధవారం పాడేరులో నిర్వహించిన ఐటీడీఏ 71వ పాలకవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. మన్యంలో గిరిజనాభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. జిల్లా స్థాయి అధికారులు నెలకు కనీసం రెండుసార్లు ఏజెన్సీలో పర్యటించి, అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. పాడేరులో బ్లడ్బ్యాంకు ఏర్పాటు చర్యలు చేపడుతున్నామని, అరకులోయలో మూడు నెలల్లో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మాతాశిశు మరణాల నివారణ చర్యల్లో భాగంగా గర్భిణుల కోసం ప్రతి మండలంలో ‘బర్త్ వెయిటింగ్ హాల్’ నిర్మిస్తామని ఆయన చెప్పారు. ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాల్లో ప్రస్తు తం ఉన్న ప్రవేశ రుసుమునకు అదనంగా రూ.10 చొప్పున వసూలు చేయాలని, ఈ సొమ్ముతో పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తామని కలెక్టర్ చెప్పారు.