నేడు 13 జిల్లాల్లో ‘డ్రై రన్’
ABN , First Publish Date - 2021-01-02T12:00:16+05:30 IST
రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ సిద్ధమైంది. శనివారం(జనవరి 2 న) ప్రతి జిల్లాలోని మూడు ప్రదేశాల్లో డ్రై రన్....
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ సిద్ధమైంది. శనివారం(జనవరి 2 న) ప్రతి జిల్లాలోని మూడు ప్రదేశాల్లో డ్రై రన్ నిర్వహించేందుకు 39 ప్రదేశాలను గుర్తించారు. ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వాసుపత్రి, ఒక ప్రైవేటు ఆస్పత్రితోపాటు గ్రామాల్లోని ‘కామన్ ప్రదేశం’లో డ్రై రన్ నిర్వహిస్తారు. దీనిపై జిల్లాస్థాయి టాస్క్ఫోర్సు సమావేశాన్ని కలెక్టర్లు గురువారమే నిర్వహించారు. వ్యాక్సిన్ లబ్ధిదారులను ముందుగానే గుర్తించి కొవిన్ వెబ్సైట్లో పొందుపరిచారు. సూచించిన సమయానికి వ్యాక్సినేషన్ సెంటర్కు చేరుకోవాలి.
2గంటల వ్యవధిలో 25 మంది హెల్త్కేర్ వర్కర్లకు టైం శ్లాట్ ఇవ్వాలి. ఒకటవ వ్యాక్సినేషన్ ఆఫీసర్ లబ్ధిదారుల పేర్లు, అడ్ర్సలు, వివరాలు పరిశీలిస్తారు. రెండవ వ్యాక్సినేషన్ ఆఫీసర్ కొవిన్ వెబ్సైట్లో లబ్ధిదారుల వివరాలు పరిశీలిస్తారు. అనంతరం డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు కొవిన్లో రిపోర్టు చేస్తారు. మూడవ వ్యాక్సినేషన్ ఆఫీసర్ క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తారు. వ్యాక్సిన్ పొందినవారు 30 నిమిషాల పాటు విశ్రాంతి గదిలో వేచి ఉండాలి. ఈ విధంగా వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేస్తారు.