ఆలయ పూజారి ఇల్లు కూల్చివేత
ABN , First Publish Date - 2021-12-19T09:19:02+05:30 IST
ఆలయ పూజారి ఇల్లు కూల్చివేత
పురుగుల మందు తాగిన బాధితుడు
కోర్టులో కేసు ఉండగానే కూల్చివేసినట్లు ఫిర్యాదు
భీమడోలు, డిసెంబరు 18: పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులోని సంతమార్కెట్ పంచాయతీ స్థలంలో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న రామలింగాచారి అనే ఆలయ పూజారి ఇంటిని ఖాళీ చేయించే క్రమంలో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కొన్నేళ్లుగా ఆయన ఇక్కడి కంచి కామాక్షి ఆలయంలో పూజారిగా, ఆలయ నిర్వాహకుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఉంటున్న 200 గజాల స్థలాన్ని పరిశీలించి, అక్కడ గ్రంథాలయ భవనం నిర్మించాలని పంచాయతీ తీర్మానం చేసింది. అయితే దీనిపై బాధితుడు గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు. కేసు కోర్టులో ఉండగానే అధికారులు ఆయన రేకుల షెడ్డును కూల్చివేశారు. దీంతో ఆయన పురుగుల మందు తాగారు. బంధువులు ఆసుపత్రికి తరలించడంతో కోలుకుంటున్నాడు. తనకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూల్చి వేసినట్లు భీమడోలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అధికారులు మాత్రం కోర్టు నుంచి స్టే ఉత్తర్వులేవీ రాలేదని చెబుతున్నారు.