వైసీపీ వెబ్సైట్లో రఘురామ పేరు తొలగింపు
ABN , First Publish Date - 2021-06-14T09:08:26+05:30 IST
వైసీపీ అధికారిక వెబ్సైట్లో ఎంపీల జాబితా నుంచి తన పేరు తొలగించారని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. 48 గంటల్లోగా తిరిగి తన పేరును ఆ
పొరపాటున జరిగిందా? కావాలనే తీసేశారా?
స్పష్టత ఇవ్వాలని జగన్కు నరసాపురం ఎంపీ లేఖ
48 గంటల్లోగా పేరు తిరిగి చేర్చాలని అల్టిమేటం
న్యూఢిల్లీ, జూన్ 13(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారిక వెబ్సైట్లో ఎంపీల జాబితా నుంచి తన పేరు తొలగించారని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. 48 గంటల్లోగా తిరిగి తన పేరును ఆ వెబ్సైట్లో చేర్చకపోతే, తనను స్వతంత్ర ఎంపీగా గుర్తించాలని పార్లమెంటు సెక్రటేరియట్ను కోరతానని అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్కు ఆయన ఆదివారం లేఖ రాశారు. ‘నా పేరు ఎందుకు తొలగించారు? పొరపాటున జరిగిందా? కావాలనే చేశారా? లేక నన్ను పార్టీ నుంచి బహిష్కరించారా? లేదా సస్పెండ్ చేశారా? స్పష్టత ఇవ్వండి. 48 గంటల్లోగా మీరు మన వెబ్సైట్లో తిరిగి నా పేరు చేర్చకపోతే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి లోబడి నన్ను స్వతంత్ర ఎంపీగా గుర్తించమని లోక్సభ సెక్రటేరియట్ను కోరతా’ అని ఆ లేఖలో రఘురామ హెచ్చరించారు.
కావాలని, పనిగట్టుకుని తన పేరు తొలగించినట్టయితే కచ్చితంగా పార్టీనుంచి తనను బహిష్కరించినట్టుగా భావిస్తానన్నారు. వైసీపీ అధికారిక వెబ్సైట్లో పార్టీ లోక్సభ, రాజ్యసభ సభ్యులు 28మంది పేర్లతో జాబితా పెట్టారని, ఇటీవల ఉపఎన్నికల్లో గెలుపొందిన తిరుపతి ఎంపీ గురుమూర్తి పేరును కూడా ఆ జాబితాలో చేర్చారని గుర్తు చేశారు. తనను పార్టీ నుంచి బహిష్కరించనప్పుడు, పార్టీ వెబ్సైట్లో తన పేరును ఎందుకు తొలగించారో స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు.