ప్రతి అక్షరం ఆచి తూచి!
ABN , First Publish Date - 2021-07-17T07:55:14+05:30 IST
భాగస్వాములందరితో పూర్తి స్థాయిలో చర్చలు జరిపిన తర్వాతే కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ రూపొందించామని కేంద్ర జలశక్తి శాఖ అధికారులు స్పష్టం చేశారు
అందరితో చర్చించాకే నోటిఫికేషన్ ఖరారు
ఏపీ విభజన చట్టం ప్రకారం నిర్ణయం
3 షెడ్యూళ్లుగా రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు
బోర్డు పరిధిలోకి చేర్చినవి షెడ్యూల్-2లో
వీటికి సీఐఎ్సఎఫ్ బలగాలతో భద్రత
అనుమతులు లేనివీ జాబితాలో చేర్చాం
అంతమాత్రాన అనుమతులిస్తున్నట్లు కాదు
జలశక్తి శాఖ అధికారుల వివరణ
అనుమతులు ఉన్న ప్రాజెక్టులకు, అనుమతులు లేని ప్రాజెక్టులకు నోటిఫికేషన్లో నిర్వచనం ఇచ్చాం. షెడ్యూల్స్లో పేర్కొన్నంత మాత్రాన అన్ని ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేస్తున్నట్లు కాదు.
2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బోర్డుల పరిధిపై నిర్ణయానికి రాలేకపోయాం. 2020 అక్టోబరులో జరిగిన భేటీలో పరిధులను ఖరారు చేయాలని నిర్ణయం జరిగింది. ఆ మేరకే ఇప్పుడు ఖరారుచేసి నోటిఫికేషన్ ఇచ్చాం.
- జలశక్తి శాఖ అధికారులు
న్యూఢిల్లీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): భాగస్వాములందరితో పూర్తి స్థాయిలో చర్చలు జరిపిన తర్వాతే కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ రూపొందించామని కేంద్ర జలశక్తి శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రతి అక్షరం ఆచితూచి రాశామని... పార్లమెంటులో చట్టాలకంటే పకడ్బందీగా తయారు చేశామని చెప్పారు. గెజిట్ నోటిఫికేషన్ విడుదల సందర్భంగా జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి సంజీవ్ అవస్థి, కేంద్ర జలసంఘం చైర్మన్ ఎస్కే హల్దార్, సభ్యుడు వోరా శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో ఉన్న ప్రాజెక్టుల పరిపాలన, నియంత్రణ, ఆపరేషన్, నిర్వహణ బోర్డుల పరిధిలో ఉంటాయని అవస్థి తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం నిబంధనల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య జలాలు, విద్యుత్ నిర్వహణను చూస్తాయని చెప్పారు. ‘రెండు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న అన్ని ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకున్నాం. వాటిని మూడు షెడ్యూళ్లుగా విభజించాం. షెడ్యూల్-1లో రెండు రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను చేర్చాం. షెడ్యూల్-2లో బోర్డుల అధీనంలో ఉండే ప్రాజెక్టులను చేర్చాం. కేంద్ర హోం శాఖను సంప్రదించి వీటికి సీఐఎ్సఎఫ్ బలగాలతో రక్షణ ఏర్పాటు చేస్తాం. షెడ్యూల్-3లో రాష్ట్రప్రభుత్వాల అధీనంలో ఉండే ప్రాజెక్టులను చేర్చాం. అయితే కేంద్రం నిర్దేశాల మేరకే వాటిని నిర్వహించాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేశారు. బోర్డుల నిర్వహణకయ్యే ఖర్చును రెండు రాష్ట్రాలూ సమానంగా భరించాలన్నారు. 60 రోజుల్లో ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ. 200 కోట్ల చొప్పున నిధులు డిపాజిట్ చేయాలని పేర్కొన్నారు. తద్వారా నిధుల కొరత లేకుండా వనరుల కోసం అక్కడిక్కడ చూడకుండా బోర్డులు పనిచేస్తాయన్నారు.
2014లోనే ఉనికిలోకి వచ్చినా..
2014లోనే కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలు ఉనికిలోకి వచ్చాయని, విభజన చట్టం అమల్లోకి వచ్చిన కొద్ది నెలల్లోనే వీటిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అవస్థి తెలిపారు. వాటికి పరిధులు ఉండాలని సదరు చట్టంలో పేర్కొన్నప్పటికీ ఇప్పటివరకు ఖరారు కాలేదని, దాంతో అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు తాజాగా పరిధులను ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో విస్తృతంగా మంతనాలు, చర్చలు జరిపి గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేశామన్నారు. జల సంఘం అధికారులు వ్యక్తిగతంగా శ్రద్ధతీసుకుని అర్ధరాత్రులు కూడా పనిచేశారని, పార్లమెంటు ఆమోదానికి వెళ్లే బిల్లులపై కూడా ఇంతగా చర్చలు జరగలేదేమోనన్నారు. అనుమతులున్న ప్రాజెక్టులకే నీటి కేటాయింపులు చేయాల్సి ఉంటుందని జలసంఘం చైర్మన్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నీటి వాటాలు అత్యంత సున్నితమైన అంశమని, ఏకాభిప్రాయం సాధనకు చాలా సమావేశాలు, శ్రమ చేయాల్సి ఉంటుందన్నారు. అన్ని భాగస్వాముల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని చేయాల్సి ఉంటుందని, కేఆర్ఎంబీ ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్కు తరలించడంలో కూడా మనోభావాలను గుర్తించాల్సి ఉంటుందని తెలిపారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఎప్పటికప్పుడు నీటి కేటాయింపులు జరుపుతున్నాయని.. ఇది తదుపరి కూడా కొనసాగుతుందని, నోటిఫికేషన్ జారీ కావడం వల్ల ఇకపై ప్రాజెక్టుల నిర్వహణ అధికారం వాటి చేతికి వస్తుందని వోరా తెలిపారు.
మినిట్స్ను ఎప్పుడో సర్క్యులేట్ చేశాం..
తెలంగాణ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తోందని విలేకరులు ప్రస్తావించగా.. విభజన చట్టంలోని సెక్షన్ 87 ప్రకారమే గెజిట్ జారీ చేశామని అవస్థి తెలిపారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం జరిగిందని, సమావేశపు మినెట్స్ను ఎప్పుడో సర్క్యులేట్ చేశామని చెప్పారు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలో ఉన్నప్పుడు సీఐఎ్సఎఫ్ బలగాలను ఎలా మోహరిస్తారని ప్రశ్నించగా.. మౌలిక సదుపాయాలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విభజన చట్టంలోనే ఉందని హల్దార్ సమాధానం ఇచ్చారు.
కొత్త ట్రైబ్యునల్పై న్యాయసలహా కోరాం
కృష్ణా జలాలకు సంబంధించి కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై అవస్థి స్పందిస్తూ.. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ను ఉపసంహరించుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తమకు సమాచారమ్చిందని.. అయితే ఉపసంహరించుకున్న తర్వాత న్యాయ సలహా తీసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం జరిగిందని తెలిపారు. దాని ప్రకారం న్యాయసలహా కోసం కేంద్ర న్యాయ శాఖకు ప్రతిపాదనలు పంపించామని, దాన్ని అధ్యయనం చేయడానికి చాలా సమయం పడుతుందన్నారు. దీనికి సంబంధించి పూర్వాపరాలను, అనేక ఇర వివరాలను అందించాలని న్యాయ శాఖ తమను కోరిందని వెల్లడించారు. అవన్నీ సమర్పించామని, రోజువారీగా ఆ శాఖతో టచ్లో ఉన్నామని చెప్పారు. అయితే, కేంద్ర హోం శాఖ ఏ అభిప్రాయం చెబుతుందో తమకు తెలియదని, అది ఏ అభిప్రాయం చెప్పినా దానిపై జలశక్తి మంత్రి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.