విశాఖలో పాదయాత్రలు.. ఢిల్లీలో పాదపూజలు: సీపీఐ నారాయణ
ABN , First Publish Date - 2021-03-05T09:06:30+05:30 IST
‘‘విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుంది. విశాఖలో పాదయాత్రలు, ఢిల్లీలో పాదపూజలు చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు’’
గుంటూరు(సంగడిగుంట), మార్చి 4: ‘‘విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుంది. విశాఖలో పాదయాత్రలు, ఢిల్లీలో పాదపూజలు చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు’’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. టీడీపీ, సీపీఐ అభ్యర్థుల తరఫున గురువారం గుంటూరులో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రూ.2 లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పోస్కో కంపెనీకి అతి తక్కువ ధరకు అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నష్టాల పేరుతో కొన్ని, వ్యాపారం పేరుతో మరికొన్ని ప్రభుత్వ ఆస్తులను అంబానీ, ఆదానీలకు కేంద్రం అంటగట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. గుంటూరులో సీపీఐ, టీడీపీ అభ్యర్థుల గెలుపు రాష్ట్రానికి మార్గదర్శకమని నారాయణ అన్నారు.