రాజమండ్రి జూనియర్ కాలేజీలో 175 మంది విద్యార్థులకు పాజిటివ్
ABN , First Publish Date - 2021-03-24T23:11:12+05:30 IST
తిరుమల ప్రైవేట్ జూనియర్ కాలేజ్లో కరోనా కలకలం రేగింది. కాలేజ్ హాస్టల్లో మొత్తం 175 మంది విద్యార్థులకు కరోనా సోకింది.

రాజమండ్రి: తిరుమల ప్రైవేట్ జూనియర్ కాలేజ్లో కరోనా కలకలం రేగింది. కాలేజ్ హాస్టల్లో మొత్తం 175 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కాలేజ్ హాస్టల్లోనే ప్రభుత్వ వైద్యులు వైద్యసేవలు అందిస్తున్నారు. వైద్య సేవలను మంత్రి చెల్లుబోయిన వేణు పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దన్నారు. జాగ్రత్తలు పాటించకపోతే మరోసారి లాక్డౌన్ ఎదుర్కోవలసి ఉంటుందని వేణు చెప్పారు.
జిల్లాలో కొవిడ్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ మార్చి మూడోవారం నుంచి అడ్డుఅదుపూ లేకుండా పెరిగిపోతున్నాయి. కొవిడ్ అంతకంతకూ కోరలు చాస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతోన్న పాజిటివ్ల సంఖ్య రెట్టింపవుతోంది. దీంతో సర్వత్రా మళ్లీ ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీల్లో పాజిటివ్ల పరంపర కొనసాగుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ హైఅలర్ట్ ప్రకటించింది. మాస్క్ ఉంటేనే ఆయా పాఠశాలలు, స్కూళ్లు, కాలేజీలోకి అనుమతించాలని విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.