బడిలో కరోనా గంట

ABN , First Publish Date - 2021-08-25T09:04:58+05:30 IST

విద్యాసంస్థల్లో కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. పాఠశాలలు పునఃప్రారంభమై పది రోజులు కూడా గడవక ముందే పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు

బడిలో కరోనా గంట

నెల్లూరులో 17మంది టీచర్లు, 10మంది పిల్లలకు వైరస్‌

ఒక ఉపాధ్యాయుడి మృతి.. ‘పశ్చిమ’లో ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్‌ 


అమరావతి (ఆంధ్రజ్యోతి)/నెల్లూరు(క్రైం)/వీరవాసరం, ఆగస్టు 24: విద్యాసంస్థల్లో కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. పాఠశాలలు పునఃప్రారంభమై పది రోజులు కూడా గడవక ముందే పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు మహమ్మారి బారినపడ్డారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం 8మంది టీచర్లకు, ఐదుగురు విద్యార్థులకు పరీక్షలు చేయగా అందరికీ పాజిటివ్‌గా తేలింది. అలాగే మంగళవారం 13 మంది టీచర్లలో 9మందికి, 35మంది పిల్లల్లో ఐదుగురికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఈ నెల 22న డక్కిలి మండలంలో ఓ ఉపాధ్యాయుడు కరోనా నుంచి కోలుకోలేక మృతిచెందాడు. కాగా, పశ్చిమగోదావరి జిల్లా మత్స్యపురి జడ్పీ హైస్కూల్‌లోని ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. ఏడు, తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ విద్యార్థులకు జ్వర లక్షణాలు ఉండటంతో తల్లిదండ్రులు పరీక్షలు చేయించగా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 


కొత్తగా 1,248 కరోనా కేసులు: రాష్ట్రంలో మంగళవారం  1,248 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో 58,890 శాంపిల్స్‌ను పరీక్షించగా ఈమేరకు పాజిటివ్‌లు బయటపడ్డాయని, మరో 15మంది మరణించారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 

Updated Date - 2021-08-25T09:04:58+05:30 IST