వెబినార్లోనే ఫిర్యాదులు!
ABN , First Publish Date - 2021-12-30T08:38:29+05:30 IST
కరోనా విజృంభణతో ప్రాంతీయంగా ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టే విధానానికి ఏపీఈఆర్సీ స్వస్తి పలికింది.
![వెబినార్లోనే ఫిర్యాదులు!](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
వినియోగదారులకు దూరంగా ఫిబ్రవరి 2న ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ
అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కరోనా విజృంభణతో ప్రాంతీయంగా ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టే విధానానికి ఏపీఈఆర్సీ స్వస్తి పలికింది. విద్యుత్ చార్జీల సవరణపై రాష్ట్ర వినియోగదారులతో హైదరాబాద్ కేంద్రంగా ఏపీఈఆర్సీ వచ్చే ఏడాది రెండో తేదీన వెబినార్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఆలోగా ఈమెయిల్లో ప్రజలు అభిప్రాయాలు పంపవచ్చని ఏపీఈఆర్సీ ప్రకటించింది. అయితే, పొరుగు రాష్ట్రం నుంచి ఇలా ప్రజాభిప్రాయాన్ని సేకరించడంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగి ఏర్పడి ఏడేళ్లయినా ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఈఆర్సీ కార్యాలయం లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కరెంటు చార్జీలు పది పైసలు పెంచినా పావలా పెంచినా.. ప్రజాసంఘాలు నిప్పులు చెరిగేవి. కానీ ఇప్పుడు నెలవారీ కరెంటు చార్జీలు వందల్లో పెరుగుతున్నా, అర్థంకాని టారిఫ్ ప్రతిపాదనలు చేస్తున్నా, ప్రజా సంఘాలూ స్పందించడంలేదు.