కోస్తాపై చలి పంజా
ABN , First Publish Date - 2021-12-19T08:48:15+05:30 IST
కోస్తాపై చలి పంజా
![కోస్తాపై చలి పంజా](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఉత్తరాది గాలులతో జనం గజగజ
బాగా పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు
విశాఖపట్నం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాది గాలులతో కోస్తాలో మూడు రోజుల నుంచి చలి తీవ్రత క్రమేపీ పెరుగుతూనే ఉంది. వాయువ్య, ఉత్తర, మధ్య భారతం నుంచి వీస్తున్న చలిగాలులు కోస్తాలో అనేక ప్రాంతాలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్రతోపాటు కోస్తాలోని శివారు ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంది. ఈ ఏడాది శీతాకాలంలో తొలిసారిగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. జంగమహేశ్వరపురంలో 13.4, కళింగపట్నంలో 13.5, నందిగామలో 14.5, విశాఖ ఎయిర్పోర్టులో 15.4 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది.
చింతపల్లిలో 6.1 డిగ్రీలు
చింతపల్లి/పాడేరు, డిసెంబరు 18: విశాఖ ఏజెన్సీలోని చింతపల్లిలో శనివారం 6.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జనవరి మొదటి పక్షం వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం ఆర్ఏ డాక్టర్ సౌజన్య తెలిపారు. ఏజెన్సీ వ్యాప్తంగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా శీతలగాలులు వీస్తున్నాయి. ఉదయం, సాయంత్రం మంచు దట్టంగా కురుస్తోంది. చలి తీవ్రతకు వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.