ఏపీలో మానవహక్కుల ఉల్లంఘనపై న్యాయపోరాటం: చంద్రబాబు
ABN , First Publish Date - 2021-05-18T02:27:35+05:30 IST
ఏపీలో మానవహక్కుల ఉల్లంఘనపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.
అమరావతి: ఏపీలో మానవహక్కుల ఉల్లంఘనపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం కరోనాను గాలికొదిలి కక్షసాధింపు చర్యల్లో నిమగ్నమైందని తప్పుబట్టారు. కరోనా వ్యాప్తిలో దేశం మొత్తం మీద ఏపీ రెండో స్థానానికి చేరిందన్నారు.
‘‘చివరికి కోవాగ్జిన్ టీకాకి కూడా కులం అంటగట్టారు. తమ జాడ్యాలను ప్రతిపక్షాలపై నెట్టే కుట్రను ఖండిస్తున్నాం. కరోనా, బ్లాక్ ఫంగస్ నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు లోపభూయిష్టం. కరోనా నియంత్రణలో వైఫల్యాలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే అక్రమ అరెస్టులు చేస్తున్నారు. దుబారా, దోపిడీని ప్రక్కన పెట్టి కరోనా బాధితులకు వెంటనే ప్యాకేజీ ఇవ్వాలి. కొవిడ్ నియంత్రణకు వెచ్చించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. వైసీపీ ప్రభుత్వ దమనకాండను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.