వీళ్లు ఆనందించలేరు.. వాళ్లు ఆగ్రహించనూలేరు

ABN , First Publish Date - 2021-11-23T09:16:00+05:30 IST

మూడు రాజధానుల నిర్ణయం రద్దు.. సీఆర్‌డీఏ పునరుద్ధరణ నిర్ణయాలపై ఎలా స్పందించాలో అర్థం కాక వైసీపీ ఎమ్మెల్యేల్లో నిర్వేదం కనిపించింది.

వీళ్లు ఆనందించలేరు.. వాళ్లు ఆగ్రహించనూలేరు

గుంటూరు-కృష్ణా, ఉత్తరాంధ్ర వైసీపీ ఎమ్మెల్యేల్లో నిర్వేదం!


అమరావతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మూడు రాజధానుల నిర్ణయం రద్దు.. సీఆర్‌డీఏ పునరుద్ధరణ నిర్ణయాలపై ఎలా స్పందించాలో అర్థం కాక వైసీపీ ఎమ్మెల్యేల్లో నిర్వేదం కనిపించింది. టీడీపీ సభ్యులు సభను బాయ్‌కాట్‌ చేయడం తో.. సోమవారం అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. సర్కారు తెచ్చిన బిల్లు పై హర్షం వ్యక్తం చేస్తూ బల్లలు చరిస్తే ఏమవుతుందోనన్న భయం గుంటూరు, కృష్ణా జిల్లాల సభ్యుల్లో కనిపించింది. ఇంతకాలం విశాఖకు రాజధాని వస్తుందని చెబుతూ వచ్చిన ఆ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేల గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. అలాగని ప్రభుత్వంపై ఆగ్రహించలేని పరిస్థితి. అకస్మాత్తుగా కేబినెట్‌ సమావేశాన్ని నిర్వహించడం.. మూడు రాజధానుల నిర్ణయాన్ని హడావుడిగా ఆమోదించడంపై మంత్రులెవరూ మాట్లాడలేదు.


మూడు రాజధానులపై జగన్‌ నిర్ణయాన్ని ప్రజలు ఆహ్వానిస్తున్నారని ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా మాట మార్చాల్సి వచ్చింది. మూడు రాజధానుల ఏర్పటుపై ప్రజల్లో టీడీపీ అపోహలు కలిగించిందంటూ ముఖ్యమంత్రి జగన్‌, మంత్రి బుగ్గన ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. మళ్లీ మూడు రాజధానుల బిల్లును సభ ముందుకు తెస్తామని సీఎం చెప్పినా.. అసలది జరుగుతుందా అనే సందేహాలు అత్యధిక ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2021-11-23T09:16:00+05:30 IST