పోలీసుల అదుపులో భార్గవరామ్?
ABN , First Publish Date - 2021-01-13T08:05:41+05:30 IST
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో కీలక నిందితుడు భార్గవరామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
![పోలీసుల అదుపులో భార్గవరామ్?](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
- రహస్య ప్రదేశంలో విచారణ?
- గోవాలో నలుగురు, ఏపీలో ఇద్దరి పట్టివేత
- వారిలో ఒకరు వైసీపీ నేత!
- మిగతా నిందితుల ఆచూకీ కోసం ఆరా
- తెరపైకి అఖిలప్రియ సోదరుడి డ్రైవర్
- రెండో రోజూ కొనసాగిన అఖిల విచారణ
హైదరాబాద్ సిటీ/బేగంపేట్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో కీలక నిందితుడు భార్గవరామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అతడిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. ప్రవీణ్కుమార్, అతడి సోదరుల కిడ్నా్ప లో సూత్రధారులు, పాత్రధారుల వివరాలను అతడి నుంచి రాబడుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా.. పోలీసులు ఇప్పటికే ఈ కేసులో 19 మంది నిందితులు అని గుర్తించగా.. అఖిల ప్రియ, సోమవారం అరెస్టయిన ముగ్గురితోపాటు.. తాజాగా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా తొమ్మిది మందిలో భార్గవరామ్, గుంటూరు శ్రీను ఉన్నారు. పరారీలో ఉన్నవారంతా ఎక్కడ తలదాచుకుంటున్నారు? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు మాత్రం.. భార్గవరామ్, గుంటూరు శ్రీను కోసం గాలిస్తున్నామని చెబుతున్నారు. అయితే.. నిందితులను గుర్తించామని, ఏ క్షణంలో అయినా వారిని అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఉత్తర, పశ్చిమ మండలాల టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం గోవాలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ మండలం పోలీసులు వారిని తీసుకుని హైదరాబాద్కు వస్తున్నారు. విజయవాడలో మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా.. వారిలో ఒకరు వైసీపీ నేత అని తెలిసింది. కాగా.. ఈ కేసులో అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్ వ్యవహారంలో అతని డ్రైవర్ ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు గుర్తించారని తెలిసింది. అఖిలప్రియ అరెస్టు సమయంలోనూ.. పోలీసులు జగత్ విఖ్యాత్ను విచారించారు.
బెంగళూరులో మంతనాలు
హఫీజ్పేట్ భూవివాదానికి సంబంధించి భూమా కుటుంబీకులు.. ప్రవీణ్ కుటుంబీకులు గతంలో బెంగళూరులో పలుమార్లు మంతనాలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ ఘటనకు కొన్ని రోజుల ముందు కూడా మీటింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ భేటీల్లో కొందరు పెద్దమనుషులు ఇరువర్గాల తరఫున మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు గుర్తించిన పోలీసులు.. వారెవరు? ఏయే అంశాలపై చర్చించారు? అనే కోణాలపై దృష్టిసారించారు. చర్చలు విఫలమవ్వడంతోనే కిడ్నాప్ జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
రెండో రోజు కస్టడీ పూర్తి
కస్టడీలో ఉన్న మాజీ మంత్రి అఖిల ప్రియను పోలీసులు రెండో రోజూ విచారించారు. మంగళవారం బేగంపేట మహిళా పోలీ్సస్టేషన్లో సాయంత్రం వరకు నార్త్జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వార్ నేతృత్వంలో.. న్యాయవాదుల సమక్షంలో పలు అంశాలపై ఇద్దరు ఏసీపీ స్థాయి అధికారులు ఆమెను ప్రశ్నించారు. భార్గవరామ్ సహా.. ఇతర నిందితులు ఎక్కడున్నారనే కోణంపై ఆమెను విచారించారు. చాలా ప్రశ్నలకు అఖిల ప్రియ మౌనంగా ఉన్నట్లు తెలిసింది. కిడ్నాపర్లతో అఖిలప్రియ ఫోన్ సంభాషణ గురించి ప్రశ్నించగా.. తాను మాజీ మంత్రినని, ఎంతో మంది తనకు ఫోన్ చేస్తారని, ఆ క్రమంలోనే గుంటూరు శ్రీను మాట్లాడాడని చెప్పినట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నంతో అఖిల ప్రియ కస్టడీ ముగియనుంది. కాగా.. రెండు రోజులుగా బేగంపేట మహిళా పోలీ్సస్టేషన్లో అఖిల ప్రియ విచారణ సాగుతుండడంతో.. అక్కడి ఫిర్యాదుల విభాగాన్ని పోలీ్సక్వార్టర్స్కు మార్చారు.