ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా : సీఎం జగన్
ABN , First Publish Date - 2021-05-07T09:32:36+05:30 IST
ఇది దేవుడు తనకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని...
- ఆర్టీసీ కార్మికులకు మెరుగైన వైద్యం
- కడపలో ఆర్టీసీ ఏరియా ఆస్పత్రి ప్రారంభం
- పుంగనూరు బస్సు డిపో కూడా..
- ఆర్టీసీకి ప్రాణం పోశారు: పేర్ని
అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కార్మికులకు మెరుగైన వైద్యం అందిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని, ఇది దేవుడు తనకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యా లయం నుంచి గురువారం కడపలో ఆర్టీసీకి చెందిన వైఎస్సార్ ఏరియా ఆస్పత్రిని సీఎం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అలాగే, చిత్తూరు జిల్లా పుంగనూరు ఆర్టీసీ బస్టాండును కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ రెండింటినీ ప్రారంభించడం మంచి పరిణామమన్నారు. కొవిడ్ సమయంలో ఆరోగ్యశాఖతో పాటు, ఆర్టీసీ కూడా ఆస్పత్రిని ప్రారంభించి, సేవలందించడం అభినందనీయమని చెప్పారు. ఈ ఆస్పత్రితో ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మాట్లాడుతూ సీఎం జగన్ ఆర్టీసీకి ప్రాణం పోశారన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటు పరంచేసేందుకు యత్నించిందని, జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వపరం చేశారని చెప్పారు.