బెడ్లు ఖాళీ లేవు.. వెళ్లిపోండి..!
ABN , First Publish Date - 2021-05-06T09:20:31+05:30 IST
ఏలూరు పెద్దాసుపత్రి వద్ద కరోనా రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రాణం పోయే స్థితిలో బాధితులు వస్తుంటే ఇక్కడ బెడ్లు ఖాళీ లేవు..
ఏలూరు ఆస్పత్రిలో పరిస్థితి దారుణం.. మంత్రి ఆళ్ల సీరియస్
ఏలూరు క్రైం, మే 5: ఏలూరు పెద్దాసుపత్రి వద్ద కరోనా రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రాణం పోయే స్థితిలో బాధితులు వస్తుంటే ఇక్కడ బెడ్లు ఖాళీ లేవు.. వెళ్లిపోండంటూ సెక్యూరిటీ గార్డులే చెప్పేస్తున్నారు. పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో కొవిడ్ అత్యవసర విభాగం ముందే కరోనా బాధితులు అంబులెన్సుల్లోనూ, బల్లలపై కూర్చుని ఆక్సిజన్ సిలెండర్లు పెట్టుకుని ప్రాణాలు కాపాడుకుంటున్న దృశ్యాలు బుధవా రం సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ మోహన్కు ఫోన్ చేసి ఆరా తీశారు. అదనంగా 38 బెడ్లను అత్యవసరంగా ఏర్పాటు చేయించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రి కి వచ్చే కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలందించడానికి కొవిడ్ స్పెషల్ ఆఫీసర్గా అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ కుమార్రెడ్డిని నియమించారు. ఆయన వెంటనే ప్రభుత్వాస్పత్రికి వచ్చి అన్ని విభాగాలు పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు.