అయ్యన్న, విజయ్, అనితల అరెస్టు వద్దు
ABN , First Publish Date - 2021-12-07T07:53:25+05:30 IST
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు చింతకాయల విజయ్, ...
![అయ్యన్న, విజయ్, అనితల అరెస్టు వద్దు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
తొందరపాటు చర్యలూ చేపట్టొద్దు
41ఏ నిబంధనలు పాటించాల్సిందే
నర్సీపట్నం పోలీసులకు హైకోర్టు ఆదేశం
అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు చింతకాయల విజయ్, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితతో పాటు మరికొందరిపై ఐపీసీ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసుల విషయం లో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నిబంధనల ప్రకారం వ్యవహరించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ సెక్షన్ కింద పిటిషనర్లకు నోటీసులు ఇచ్చి ముందుగా వివరణ తీసుకోవాలని నర్సీపట్నం పోలీసులకు స్పష్టం చేసిం ది. అరెస్టుతో పాటు ఎలాంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ సోమవారం ఆదేశాలిచ్చారు. పోలీసుల విధులను అడ్డుకున్నారని, పోలీసు వ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని నర్సీపట్నం ఎస్ఐ కె.లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పట్టణ పోలీసులు అయ్యన్నతో పాటు మరికొందరి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ కేసును కొట్టివేయాలని వారు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది శ్రీవెంకటేశ్ వాదనలు వినిపించారు.