బాధితుల కన్నీళ్లు ఆరకముందే ఇసుక తవ్వకాలా?: లోకేశ్‌

ABN , First Publish Date - 2021-12-07T08:31:29+05:30 IST

వైసీపీ ఇసుకాసురుల అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు...

బాధితుల కన్నీళ్లు  ఆరకముందే ఇసుక తవ్వకాలా?: లోకేశ్‌

అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఇసుకాసురుల అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితుల కన్నీళ్లు ఆరకముందే గ్రామాల్లో ఇసుక ట్రాక్టర్లు క్యూ కట్టాయంటే జగన్‌రెడ్డికి జనం కంటే ధనమే ముఖ్యమని అర్థమవుతోందన్నారు. ‘వైసీపీ నేతల ధన దాహానికి 39మంది జలసమాధి అయ్యారు. 12గ్రామాలు నీటమునిగాయి. రూ.1721కోట్ల నష్టం వాటిల్లింది. బాధితులకు కనీస న్యాయం జరగకముందే కడప జిల్లా నందలూరు మండలం ఆడవూరు క్వారీలో ఇసుక విక్రయాలు ప్రారంభించారు’ అని సోమవారం ట్వీట్‌ చేశారు. 


సీఎంను కలిసిన ఐఏఎస్‌ అధికారుల సంఘం: నూతనంగా ఎన్నికైన ఐఏఎస్‌ అధికారుల సంఘ ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.  తాడేపల్లిలోని  క్యాంప్‌ కార్యాలయంలో సీఎంను కలిసిన వారిలో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన అహ్మద్‌బాబు, జనరల్‌ సెక్రటరీ పీఎస్‌ ప్రద్యుమ్న, సంయుక్త కార్యదర్శి జె.నివాస్‌, కోశాధికారి ముత్యాలరాజు, కార్యవర్గ సభ్యులు ఉన్నారు.


విద్యార్థులకు వైద్యపరీక్షలు..: ఆదిమూలపు 

అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ఆరోగ్య ఇబ్బందులు ఉన్నచోట్ల విద్యార్థులందరికీ వైద్యపరీక్షలు నిర్వహించాలని, తరగతి గదులను శానిటైజేషన్‌ చేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఆదేశించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతపై మంత్రి సోమవారం అధికారులతో మాట్లాడారు. జలుబు, తీవ్రజ్వరం లక్షణాలతో 14మంది విద్యార్థులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారని, వారికి కొవిడ్‌ పరీక్షలు చేయగా నెగెటివ్‌ వచ్చిందని అధికారులు మంత్రికి తెలిపారు. 

Updated Date - 2021-12-07T08:31:29+05:30 IST