అక్టోబరులో బొగ్గు కొరత లేదు
ABN , First Publish Date - 2021-12-07T08:28:07+05:30 IST
ఏపీ సహా దేశంలో బొగ్గు నిల్వలకు అక్టోబరులో కొరత లేదని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు...
![అక్టోబరులో బొగ్గు కొరత లేదు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్రం జవాబు
న్యూఢిల్లీ, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఏపీ సహా దేశంలో బొగ్గు నిల్వలకు అక్టోబరులో కొరత లేదని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. సోమవారం రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక జవాబిచ్చారు. అక్టోబరులో భారీ వర్షాల కారణంగా దేశంలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాలో కొంత అంతరాయం కలగడంతో విద్యుదుత్పత్తి తగ్గిందని తెలిపారు. అక్టోబరు 8 నాటికి విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు 7.2 మిలియన్ టన్నుల(నాలుగు రోజులకు సరిపడా)కు తగ్గిపోయినట్లు పేర్కొన్నారు. అయితే, ఆ తర్వాత పెరిగిన బొగ్గు సరఫరాతో, బొగ్గు నిల్వలు పెరగడం మొదలైందని, నవంబరు 29 నాటికి 17.29 మెట్రిక్ టన్నుల(9రోజులకు సరిపడా)కు చేరుకుందని తెలిపారు. విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాపై విద్యుత్, బొగ్గు, రైల్వే, సెంట్రల్ ఎలక్ర్టిసిటీ అథారిటీ(సీఈఏ), కోల్ ఇండియా(సీఐఎల్), సింగరేణి కేలరీస్ కంపెనీ లిమిటెడ్ తదితర సంస్థల ప్రతినిధులతో కూడిన సబ్ గ్రూపు ఆధ్వర్యంలో క్రమంతప్పకుండా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు.