ఆ చట్టాలను రద్దు చేశాం
ABN , First Publish Date - 2021-11-27T08:43:14+05:30 IST
పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను రద్దు చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులపై ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది....
కొత్త బిల్లులకు ఉభయసభల ఆమోదం
ఏపీసీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణలపై
హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్
అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను రద్దు చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులపై ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నెల 22న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా అఫిడవిట్ దాఖలు చేస్తున్నట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి పేర్కొన్నారు. గత ఏడాది తీసుకొచ్చిన సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను రద్దు చేస్తూ ఈ నెల 22న బిల్లు ప్రవేశపెట్టి, అదే రోజు అసెంబ్లీలో పాస్ చేసి శాసనమండలికి పంపించినట్టు పేర్కొన్నారు. ఆ మరుసటి రోజు 23న శాసనమండలి కూడా వీటిని ఆమోదించిందన్నారు. ఆ మేరకు శాసనసభ కార్యదర్శి నుంచి సమాచారం అందినట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. బిల్లు ప్రవేశ పెట్టడం వెనుక ఉద్దేశం, కారణాలను అఫిడవిట్కు జత చేశామన్నారు. ఆ వివరాలు పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎ్సఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం రాజధాని వ్యాజ్యాలపై ఈ నెల 22న వరుసగా ఆరో రోజు విచారణ జరుపుతున్న సందర్భంగా అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్. శీరామ్ స్పందించారు. సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని, శాసనసభలో సీఎం ప్రకటన చేయబోతున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో ఈ వ్యవహారంపై అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.