6.32 లక్షల ఎకరాల్లో పంట నష్టం

ABN , First Publish Date - 2021-11-21T08:12:52+05:30 IST

వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో 6.32లక్షల ఎకరాల్లో పంట నష్టం ..

6.32 లక్షల ఎకరాల్లో పంట నష్టం

అధికారుల ప్రాథమిక అంచనా

అమరావతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో 6.32లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగాఅంచనా వేశారు. 5.83లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 49వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ప్రకటించారు. కడప జిల్లాలో 3,60,197, అనంతలో 2,30,322, నెల్లూరులో 29,981, చిత్తూరులో 12,237 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనాకు వచ్చారు. ఈ నాలుగు జిల్లాల్లో 172 మండలాల్లోని నాలుగు నగరాలు, 1,316 గ్రామాలపై వాయుగుండం ప్రభావం చూపిందని గుర్తించారు. 24 మంది మృతి చెందారని, 17మంది గల్లంతయ్యారని తేల్చారు. రూ.5.02 కోట్ల విలువైన 1,549 గృహాలు దెబ్బతిన్నాయని, రూ.2.31 కోట్ల విలువైన 612 పశువులు, 1,791 చిన్న జీవాలు, 3,232 కోళ్లు మృత్యువాతపడ్డాయని నిర్ధారించారు. సహాయ చర్యల కోసం కడప జిల్లాకు రూ.2.5 కోట్లు, చిత్తూరుకు రూ.2కోట్లు, నెల్లూరుకు రూ.కోటిన్నర, అనంతకు రూ.కోటి విడుదల చేశారు. మొత్తం 243 శిబిరాలు ఏర్పాటు చేసి, వాటిలోకి 20,923 మందిని తరలించారు. ముంపులో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, పునరావాస కేంద్రాల నుంచి తిరిగి వెళ్లే వ్యక్తిలకు రూ.వెయ్యి, కుటుంబానికైతే రూ.2వేలు తక్షణ సాయంగా అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-11-21T08:12:52+05:30 IST