అడ్డంగా బుక్కయిన పాడేరు టీడబ్ల్యూ ఇంజనీరు
ABN , First Publish Date - 2021-11-21T07:38:03+05:30 IST
పాడేరు గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాట్రెడ్డి వెంకట సత్యనాగే్షకుమార్ ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారనే...

విశాఖపట్నం/పాడేరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): పాడేరు గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాట్రెడ్డి వెంకట సత్యనాగే్షకుమార్ ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారనే అభియోగంపై ఏసీబీ అధికారులు శనివారం కేసు నమోదు చేశారు. పాడేరులోని ఆయన కార్యాలయం, నివాసంతోపాటు, విశాఖలోని ఆయన ఇల్లు, అత్తవారిల్లు, స్టీల్ప్లాంట్ ఉక్కునగరంలోని సోదరుడి ఇంట్లో ప్రత్యేక బృందాలు సోదాలు చేశాయి. సత్యనాగే్షకుమార్ కుటుంబ సభ్యుల పేరుతో విశాఖ బాలయ్యశాస్త్రి లేఅవుట్, మధురవాడల్లో ఫ్లాట్లు, ఆనందపురం, ఎలమంచిలి, కె.కోటపాడు, డెంకాడ, హైదరాబాద్లలో తొమ్మిది ఇళ్ల స్థలాలు, 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, రెండు కార్లు, రూ.2,46,700 నగదు, రూ.రెండు కోట్లకుపైగా బ్యాంక్ బ్యాలెన్స్, బంగారం, వెండి, గృహోపకరణాలతో పాటు రెండు కార్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఒక బ్యాంక్ లాకర్ కూడా ఉన్నట్లు గుర్తించి, ఆదివారం దానిని తెరవనున్నారు. లభించిన ఆస్తుల్లో రూ.1,34,78,180 ఆదాయానికి మించిన ఆస్తిగా పరిగణించి ఆయనపై కేసు నమోదు చేసినట్టు ఏసీబీ ఇన్చార్జి డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. సత్యనాగే్షకుమార్ను అరెస్టు చేసి ఆదివారం రిమాండ్కు తరలించనున్నట్టు వివరించారు.