పోలీసులు వేధింపులు మానాలి: అచ్చెన్నాయుడు
ABN , First Publish Date - 2021-11-21T07:34:27+05:30 IST
టీడీపీ నేతల్ని, కార్యకర్తల్ని పోలీసులు వేధించడం ఇకనైనా మానుకోవాలని లేకపోతే భవిష్యత్లో ..

అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి):టీడీపీ నేతల్ని, కార్యకర్తల్ని పోలీసులు వేధించడం ఇకనైనా మానుకోవాలని లేకపోతే భవిష్యత్లో తీవ్ర పరిణామాలు తప్పవని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలానికి చెందిన దళిత నాయకుడు పల్లి శ్రీనును పోలీసులు కొట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అతనికి ఏదైనా జరిగితే సీఎం, హోం మంత్రి, డీజీపీలదే బాధ్యత అని హెచ్చరించారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం రాత్రి డీజీపీకి ఆయన ఈ మేరకు లేఖ రాశారు. వైసీపీ ముందస్తు ప్రణాళిక ప్రకారమే అసెంబ్లీలో చంద్రబాబుకు అవమానం జరిగిందని టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రజాకోర్టులో వైసీపీ భూస్థాపితం కావడం, జగన్ కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయమన్నారు. జగన్రెడ్డి బిస్కెట్లకు కక్కుర్తిపడి వైసీపీ నేతలు చంద్రబాబును విమర్శిస్తారా? అంటూ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. తప్పుడు మాటలు మాట్లాడిన వైసీపీ నేతల్ని వెనకేసుకు రావడం జగన్ దుర్మార్గానికి నిదర్శమన్నారు. చంద్రబాబు కన్నీటికి కారకులైన వారికి రక్తకన్నీరు తెప్పించి తీరుతామని ఎస్సీ సెల్ రాష్ట్రఅధ్యక్షుడు ఎమ్మెస్ రాజు హెచ్చరించారు.