వైసీపీ పాలనలో రజకులకు ఒరిగిందేమీ లేదు
ABN , First Publish Date - 2021-10-29T10:01:18+05:30 IST
వైసీపీ పాలనలో రజకులకు ఒరిగిందేమీ లేదు
కార్పొరేషన్కు చైర్మన్ను నియమించినా నిధులు నిల్
రజక జనసేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మయ్య
చోడవరం, అక్టోబరు 28: వైసీపీ పాలనలో రజకులకు ఒరిగిందేమీ లేదని రజక జనసేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కినిపల్లి లక్ష్మయ్య ఆరోపించారు. విశాఖ జిల్లా చోడవరం, మాడుగుల నియోజకవర్గాలకు చెందిన రజకులతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకొచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా చేయూత మినహా మరే ఇతర పథకం అందలేదన్నారు. వాషర్మెన్ కార్పొరేషన్కు చైర్మన్ను నియమించినప్పటికీ నిధులు కేటాయించకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా దోబీఘాట్లు నిర్మించడం లేదని, పాత వాటికి మరమ్మతులకు కూడా నిధులు లేవంటున్నారని వాపోయారు. వాషర్మెన్ కార్పొరేషన్ ద్వారా రజక సహకార సంఘాలకు నిధులు కేటాయించి రుణాలు అందించే కార్యక్రమం చేపట్టాలన్నారు. 50 సంవత్సరాలు దాటిన రజకుడికి పింఛను ఇవ్వాలని, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చి, ఇంటి స్థలం, ఇల్లు కేటాయించాలని కోరారు.