రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజధానికి భూములిచ్చాం
ABN , First Publish Date - 2021-10-29T09:27:33+05:30 IST
రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజధానికి భూములిచ్చాం
681వ రోజు ఆందోళనలో అమరావతి రైతులు
తుళ్లూరు, అక్టోబరు 28: స్వలాభం కోసం భూములు ఇవ్వలేదు, రాష్ట్ర భవిష్యత్ కోసం.. రాజధాని అమరావతి కోసం ఇచ్చామని 33 వేల ఎకరాలు భూములు త్యాగం చేసిన రైతులు స్పష్టంచేశారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగాలని రాజధాని ,రైతు కూలీలు, మహిళలు, రైతులు చేస్తున్న ఉద్యమం గురువారంతో 681వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ.. సీఎం జగన్రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చింది సొంత ప్రయోజనాల కోసం తప్పితే రాష్ట్ర ప్రజల కోసం కాదన్నారు. తాము భూములు ఇచ్చింది రాష్ట్ర రాజధాని కోసమన్నారు. ఐదు కోట్ల మంది ప్రజారాజధాని ఏర్పాటు అవుతుందంటేనే భూములు త్యాగం చేశామన్నారు. గెలవకముందు అమరావతికి ఓకే అన్న సీఎం జగన్రెడ్డి, అధికారం చేపట్టాక మూడు ముక్కలాట అంటూ అమరావతిపై కుట్ర పన్నారని మండిపడ్డారు. రూ.పదివేల కోట్ల విలువైన పనులు రాజధానిలో జరిగాయన్నారు. ఐదేళ్ల నుంచి పాలన అమరావతి నుంచే కొనసాగుతుందన్నారు. సేవ్ అమరావతి సేవ్ ఆంధ్రపదేశ్ అంటూ నినాదాలు చేస్తూ దీపాలు వెలిగించి అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు.