‘జగతి’ కేసులో కౌంటర్‌ దాఖలు చేసిన సీబీఐ

ABN , First Publish Date - 2021-10-29T08:20:53+05:30 IST

‘జగతి’ కేసులో కౌంటర్‌ దాఖలు చేసిన సీబీఐ

‘జగతి’ కేసులో కౌంటర్‌ దాఖలు చేసిన సీబీఐ

వాన్‌పిక్‌ కేసులో కోర్టుకు మోపిదేవి హాజరు

హైదరాబాద్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల వ్యవహారంలో జగతి పబ్లికేషన్‌ కేసుకు సంబంధించి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దాఖలు చేసుకున్న డిశ్చార్జ్‌ పిటిషన్‌కు సంబంధించి సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. గురువారమిక్కడ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. జగన్‌ డిశ్చార్జ్‌ పిటిషన్‌పై పూర్తి వివరాలు ేసకరించిన తర్వాత కౌంటర్‌ దాఖలు చేస్తున్నట్లు సీబీఐ నివేదించింది. ఈ కేసులో 22వ తేదీనే కౌంటర్‌ సమర్పించాల్సి ఉన్నప్పటికీ.. ఆ రోజు ప్రత్యేక కోర్టు జడ్జి మధుసూదన్‌రావు సగం దినం సెలవులో ఉండడంతో గురువారం అందజేశారు. ఇదే కేసులో జగన్‌, విజయసాయిరెడ్డి తదితర నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్‌ పిటిషన్లపై కౌంటర్‌ దాఖలుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కోర్టును మరింత సమయం కోరింది. ఇండియా సిమెంట్స్‌ కేసులో దర్యాప్తు పూర్తి కావచ్చినట్లు తెలిపింది. ఇంకోవైపు.. వాన్‌పిక్‌ కేసులో మాజీ మంత్రి, వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ గురువారం సీబీఐ కోర్టు ముందు హాజరయ్యారు. దాంతోపాటు ఇందూ ప్రాజెక్టు కేసులో జగన్‌ డిశ్చార్జ్‌ పిటిషన్‌పై విచారణను కోర్టు నవంబరు 1కి వాయిదా వేసింది. రఘురాం సిమెంట్స్‌ కేసు విచారణ నవంబరు 5కి, ఓఎంసీ కేసులో సబితా ఇంద్రారెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌ డిశ్చార్జ్‌ పిటిషన్లపై విచారణ నవంబరు 1కి వాయిదా వేసింది. కాగా.. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ(ఓఎంసీ) కేసులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి  శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఆమె డిశ్చార్జ్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. విచారణను నవంబరు 2కి వాయిదా వేసింది.

Updated Date - 2021-10-29T08:20:53+05:30 IST