వివేకా హత్య ఏ టెర్రరిస్టు కనుసన్నల్లో జరిగింది?
ABN , First Publish Date - 2021-10-28T08:05:12+05:30 IST
వివేకా హత్య ఏ టెర్రరిస్టు కనుసన్నల్లో జరిగింది?

విజయసాయి రెడ్డి సమాధానం చెప్పాలి
పట్టాభిని చంపాలని వైసీపీ ఆలోచిస్తోంది: టీడీపీ
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ‘మాజీ సీఎం చంద్రబాబు టెర్రరిస్టు అని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ రెడ్డి బాబాయి వివేకా హత్య ఏ టెర్రరిస్టు కనుసన్నల్లో జరిగిందో ప్రజలకు తెలియదా? రాష్ట్రంలో టెర్రరిస్టుల మాదిరిగా దాడులు చేస్తోంది ఎవరు? రాళ్లు వేయించుకొని దెబ్బలు తిన్నవారు విజయసాయి భాషలో టెర్రరిస్టులా? సమాధానం చెప్పాలి’ అని టీడీపీ డిమాండ్ చేసింది. మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు బుధవారం మాట్లాడారు. ‘రాష్ట్రంలో తీవ్రవాదాన్ని, ఫ్యాక్షనిజా న్ని, మత కల్లోలాలను, రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని నిర్మూలించిన చరిత్ర చంద్రబాబుది. వాటిని పునరుద్ధరిస్తున్న చరిత్ర జగన్ రెడ్డిది. డ్రగ్స్పై ప్రతిపక్షంగా మేం మాట్లాడాం. మద్యం ధరలు పెరిగిపోవడం వల్ల రాష్ట్రంలో చాలామంది గంజాయికి అలవాటుపడ్డారు. చంద్రబాబు ఇంటి మీదకు వైసీపీ ఎమ్మెల్యే దాడికి వెళ్తే ప్రభుత్వం, డీజీపీ సమర్ధించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిచేసి సిబ్బంది తలలు పగలగొట్టారు. ఇం త అరాచకం ప్రబలిపోతే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లకూడదా? బాబు నాయకత్వంలో టీడీపీ బృందం ఢిల్లీ వెళ్తే వైసీపీ నాయకులు చలి జ్వరం వచ్చినట్లు వణుకుతున్నారు’ అని అన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని చంపాలని వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారనే అనుమానం కలుగుతోందని, అందుకే ఆయనను చంద్రబాబు చంపుతారని అంటున్నారని అన్నారు.
బాత్రూంలో కాలు జారి పడటం గుర్తులేదా?: అయ్యన్న
‘ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెం ట్ వచ్చేసిందని హడావుడి చేయడం.. అది రాకపోయేసరికి బాత్రూంలో జగన్ రెడ్డి కాలుజారి పడ్డారని బిల్డప్ ఇవ్వడం గుర్తులేదా?’ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు అయ్యన్న బుధవారం తన ట్విటర్లో కౌంటర్ ఇచ్చారు.