ఏపీ వర్సెస్‌ తెలంగాణ

ABN , First Publish Date - 2021-10-20T09:01:02+05:30 IST

ఏపీ వర్సెస్‌ తెలంగాణ

ఏపీ వర్సెస్‌ తెలంగాణ

గాలిపాడు తనిఖీలకు నల్లగొండ పోలీసులు అనుమతి తీసుకోలేదన్న డీఐజీ

చెప్పే వచ్చామన్న  నల్లగొండ పోలీసులు


విశాఖపట్నం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణా చేస్తున్నవారిని పట్టుకునేందుకు విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి తెలంగాణ నుంచి పోలీసులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ఇరు రాష్ట్రాల పోలీసుల వాదనలు భిన్నంగా ఉన్నాయి. తాము తూర్పుగోదావరి, విశాఖపట్నం పోలీసులకు ముందుగానే చెప్పి రంగంలోకి దిగామని నల్లగొండ పోలీసులు ఇటీవల స్పష్టం చేశారు. అయితే.. దీనిపై విశాఖ రేంజ్‌ డీఐజీ రంగారావు భిన్నమైన వాదన వినిపించారు. ఏజెన్సీలో గంజాయి నిందితులను పట్టుకునేందుకు తెలంగాణ, ఇతర రాష్ట్రాల పోలీసులు గడచిన రెండు, మూడు వారాల్లో స్థానిక పోలీసుల సహకారాన్ని తీసుకున్నారని చెప్పిన ఆయన చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ గాలిపాడుకు చెందిన నిందితులను పట్టుకునేందుకు మాత్రం నల్లగొండ పోలీసులు స్థానిక పోలీసుల సహకారాన్ని తీసుకోలేదని డీఐజీ తెలిపారు. విశాఖ రూరల్‌ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. గంజాయి నిందితులను పట్టుకునేందుకు నల్గొండ పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం లేకుండా చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ గాలిపాడు గ్రామానికి వెళ్లారన్నారు. నిందితులను పట్టుకునే క్రమంలో స్థానికులు దాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామన్నారు.

Updated Date - 2021-10-20T09:01:02+05:30 IST