విశాఖలో 100 కోట్ల భూ వివాదం
ABN , First Publish Date - 2021-09-04T08:48:21+05:30 IST
విశాఖపట్నంలో సరికొత్త భూ వివాదాలు తలెత్తుతున్నాయి.
అమెరికాలో ఉన్న యజమానికి తెలియకుండా అమ్మకం
కొనుగోలు చేశామంటున్న వైసీపీ ఎమ్మెల్యే కుమారుడు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో సరికొత్త భూ వివాదాలు తలెత్తుతున్నాయి. కొమ్మాదిలో రూ.100 కోట్ల విలువైన భూమిని అధికార పార్టీ ఎమ్మెల్యే తన కుమారుడి పేరుతో కొనుగోలు చేయగా, ఆ భూమిని తాము ఎవరికీ అమ్మకానికి పెట్టలేదని యజమాని భార్య పీఎంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఈ విషయం తెలిసి, ఎమ్మెల్యే కుటుంబం కూడా ఎదురుకేసు పెట్టింది. వివరాలు... తుమ్మల కృష్ణ చౌదరి పదేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నారు. ఆయనకు తండ్రి నుంచి వారసత్వంగా కొంత భూమి వచ్చింది. ఆ తరువాత ఆ పక్కనే మరికొంత భూమి కొనుగోలు చేశారు. ఇలా దఖలు పడిన భూమి కొమ్మాది సర్వే నంబర్లు 54/1, 54/2, 54/3, 54/4, 54/5 తదితర నంబర్లలో 12.26 ఎకరాలు ఉంది. భార్య లక్ష్మీ సూర్యప్రసన్న తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడులో ఉంటారు. వైసీపీ నాయకుడు, ఉత్తర నియోజకవర్గానికి ఒకప్పుడు సమన్వయకర్తగా వ్యవహరించిన బిల్డర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి సనపల చంద్రమౌళి కొమ్మాదిలో 12.26 ఎకరాల భూమి అమ్మకానికి ఉందని ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజుకు చెప్పారు. యజమాని అమెరికాలో ఉంటారని, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పడంతో బేరం కుదుర్చుకున్నారు. అడ్వాన్సుగా దఫదఫాలుగా రూ.3.5 కోట్లు కృష్ణ చౌదరికి చెందినట్టుగా చెబుతున్న ఖాతాలో జమ చేశారు. కూర్మన్నపాలెం ఐసీఐసీఐ బ్యాంకులో ఈ మొత్తం జమ చేశామని ఎమ్మెల్యే కుమారుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ సుకుమారవర్మ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
మధురవాడలో పెండింగ్ రిజిస్ట్రేషన్
ఆ భూమిని ఆగస్టు 28న మధురవాడ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్కు పెట్టారు. అందులో పేర్కొన్న భూమి ధర ప్రభుత్వ లెక్క ప్రకారం లేనందున దాన్ని సబ్ రిజిస్ట్రార్ జిల్లా రిజిస్ట్రార్కు పంపగా, పరిశీలన కోసం ఒక నంబరు కేటాయించి పెండింగ్ పెట్టారు. సమాచారం తెలుసుకున్న కృష్ణచౌదరి భార్య లక్ష్మీ సూర్యప్రసన్న సెప్టెంబరు 1న పోలీస్ కమిషనర్, కలెక్టర్, సబ్ రిజిస్ట్రార్లతో పాటు పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరజాపు శ్రీనివాసరావు అనే వ్యక్తి తన భర్తనుంచి జీపీఏ తీసుకున్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించి, ఆ భూమిని అమ్మేశారని ఆమె ఆరోపించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, సబ్ రిజిస్ట్రార్ మోహనరావు మాట్లాడుతూ, కృష్ణచౌదరి తన తరపున భూమిని విక్రయించడానికి స్పెషల్ పవర్ను జరజాపు శ్రీనివాసరావుకు అప్పగిస్తూ అగ్రిమెంట్ రాసి, నోటరీ చేయించి ఇండియాకు పంపించారని చెప్పారు. జిల్లా రిజిస్ట్రార్ పరిశీలించి, పత్రాలన్నీ సక్రమంగా ఉన్నాయని ధ్రువీకరించాక, రిజిస్ర్టేషన్కు నంబరు ఇచ్చామని వివరించారు.