జాతీయ విపత్తుగా పరిగణించాలి

ABN , First Publish Date - 2021-11-28T08:12:42+05:30 IST

జాతీయ విపత్తుగా పరిగణించాలి

జాతీయ విపత్తుగా పరిగణించాలి

రాష్ట్రంలో వరదల పరిస్థితిపై టీడీపీ ఎంపీల సమావేశం డిమాండ్‌

అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని టీడీపీ ఎంపీల సమావేశం డిమాండ్‌చేసింది. 29నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన శనివారం ఆన్‌లైన్‌లో ఈ సమావేశం జరిగింది. ‘‘వరదలను సమర్థంగా ఎదుర్కోవడంలో, బాధితులకు న్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బాధితులకు న్యాయం జరగడానికి ఈ దుర్ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలి. పెద్ద సంఖ్యలో మరణాలు కూడా సంభవించాయి. దీనిపై న్యాయ విచారణ జరపడానికి ఒత్తిడి తేవాలి’’ అని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని, ఈ అంశాన్ని కూడా పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాలని చెప్పారు. పెట్రోలు, డీజిల్‌ ధరల తగ్గింపునకు రాష్ట్ర ప్రభుత్వం తనవంతు ప్రయత్నం చేయకపోవడాన్నీ ఎత్తిచూపాలని నిర్ణయించారు. అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేయడంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటు సమావేశాల్లో గళం విప్పాలని నిర్ణయించారు. వివేకా హత్యకు రూ.40 కోట్లు సుపారీగా ఇవ్వాల ని ఒప్పందం కుదుర్చుకోవడం, రూ.కోటి అడ్వాన్సుగా చెల్లించడంపై ఈడీ దర్యాప్తు జరపాలని కోరాలని నిర్ణయించారు. 


ప్రధానికి సీపీఐ రామకృష్ణ లేఖ 

రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలను జాతీయ విపత్తుగా గుర్తించి ఆదుకోవాలని ప్రధాని మోదీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు పీఎంకు ఓ లేఖ రాసినట్లు తెలిపారు. ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించి సహాయ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తక్షణమే కేంద్రం నుంచి వరద సహాయక నిధులు విడుదల చేయాలని ఆ లేఖలో రామకృష్ణ కోరారు.

Updated Date - 2021-11-28T08:12:42+05:30 IST