అనాథ పిల్లలకు రూ.10 లక్షలు: సింఘాల్
ABN , First Publish Date - 2021-05-20T08:36:08+05:30 IST
కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్గ్రేషియో ప్రకటించింది.

అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్గ్రేషియో ప్రకటించింది. ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను జిల్లా కలెక్టర్లు గుర్తించి వారికి రూ.10 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. కాగా కొన్ని నిబంధనలు విధించింది. బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
18 ఏళ్ల చిన్నారులకు అందజేస్తారు. మరణించిన వారికి ఇతర ఇన్సూరెన్సు ఏమీ లేకుండా ఉన్న వారికి మాత్రమే పరిహారం అందిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీని నియమించింది. అర్హత కలిగిన పిల్లల్ని గుర్తించి జాతీయ బ్యాంకులలో రూ.10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. ఈ బాండ్లను పిల్లలకు అందించాలి. పిల్లలు 25 ఏళ్లు వచ్చే వరకూ ఆ మొత్తాన్ని తీసుకోవడానికి లేదు. ప్రతి నెలా వచ్చే వడ్డీని మాత్రం పిల్లలు పోషణకోసం డ్రా చేసుకునే అవకాశం కల్పించారు.