ఆనందయ్య మందు సేఫ్: ఆయుష్ కమిషనర్
ABN , First Publish Date - 2021-05-25T00:30:43+05:30 IST
ఆనందయ్య మందు సేఫ్ అని ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు నాయక్ ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో

అమరావతి: ఆనందయ్య మందు సేఫ్ అని ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు నాయక్ ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో ఈ మందులో 18 మూలికలు ఉపయోగిస్తున్నారని, మందు వాడినవారి అభిప్రాయం తీసుకున్నామని తెలిపారు. వీటిలో ఎక్కడా హానికరమైన పదార్థాలు లేవని ఆయుష్ కమిషనర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ల్యాబ్ నుంచి సానుకూల రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. 5 రోజుల్లో మరో మూడు టెస్ట్ రిపోర్టులు వస్తాయని చెప్పారు. రిపోర్టులు వచ్చాక సీఎం జగన్ మందు పంపిణీపై నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఇప్పటికే 500 మంది నుండి వివరాలు సేకరించామని, కంట్లో వేసే చుక్కల అపోహలపై చర్చిస్తున్నామని రాములు నాయక్ తెలిపారు.
‘‘చుక్కల మందులో 3 రకాలు వాడుతున్నారు. తేనె, తోకమిరియలు, ముళ్ల వంకాయతో తయారు చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా కేసులు కూడా తక్కువే. ఇప్పటి వరకు 80 వేల మంది వరకు మందు వేసుకున్నారు. ఆయుర్వేద మందుగా గుర్తించాలంటే డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ ప్రకారం నిర్ణయించాలి. ఈ మందును ఆయుర్వేదం అనడానికి చట్టపరంగా అవకాశం లేదు. ఈ మందు వల్ల కరోనా తగ్గుతుందని ఎక్కడా చెప్పడానికి లేదు. అందుకే దీన్ని ఆయుర్వేద మెడిసిన్గా కాకపోయినా మరో విధంగా ఇవ్వడంపై సీఎం ఆలోచిస్తామన్నారు. ఆనందయ్య మందును నాటు మందు అని అవమానించడం లేదు’’ అని రాములు నాయక్ అన్నారు.