పాలమూరు ప్రాజెక్టులో..67 టీఎంసీల రిజర్వాయర్లా?
ABN , First Publish Date - 2021-10-07T08:26:59+05:30 IST
తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న డిండి ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులివ్వాలని కోరుతూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో ఆంధ్రప్రదేశ్ బుధవారం పిటిషన్ దాఖలు చేసింది.
![పాలమూరు ప్రాజెక్టులో..67 టీఎంసీల రిజర్వాయర్లా?](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
డిండి స్కీం నిలిపివేతకు ఎన్జీటీలో ఏపీ పిటిషన్
అమరావతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న డిండి ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులివ్వాలని కోరుతూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో ఆంధ్రప్రదేశ్ బుధవారం పిటిషన్ దాఖలు చేసింది. ఇదే సమయంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో సాగు నీటి పథకాలనూ అక్రమంగా నిర్మిస్తున్నారని తెలిపింది. ఎన్జీటీ వేసిన నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో చేసిన అధ్యయనంలో ఇది వెల్లడి కావడంతో.. తాగునీటి కోసం 67 టీఎంసీలు కావాలంటూ తెలంగాణ కొత్త రాగం అందుకుందని ఆక్షేపించింది. ‘ఒక టీఎంసీ నీరు ఐదు లక్షల మందికి సరిపోతుంది. 67 టీఎంసీల నీరు నిల్వ చేయడమంటే.. ఏకంగా తెలంగాణ మొత్తం అవసరాలకు పాలమూరు-రంగారెడ్డి సరిపోతుంది. ఇంత భారీ స్థాయిలో రిజర్వాయర్లను నిర్మించి కృష్ణా జలాలను మళ్లిస్తే.. దిగువన ఉన్న మాకు నీరే అందదు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీరివ్వాలంటే.. శ్రీశైలంలో 854 అడుగుల ఎత్తులో నీటి నిల్వలు ఉండాలి. ఆ మట్టానికి నీరు రాకుండా పాలమూరు-రంగారెడ్డి ద్వారా నీటిని అక్రమంగా మళ్లించేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోంది’ అని ట్రైబ్యునల్ దృష్టికి తీసుకొచ్చింది.