‘తిరునామాలు’ వ్యక్తి ఇంట్లో నోట్ల కట్టలు

ABN , First Publish Date - 2021-05-18T09:17:13+05:30 IST

శ్రీవేంకటేశ్వరస్వామి తిరునామాలు దిద్దుకుంటూ తిరుమలలో జీవనం సాగించిన ఓ ఒంటరి వ్యక్తి ఇంటిలో కరెన్సీ కట్టలు లభించాయి.

‘తిరునామాలు’ వ్యక్తి ఇంట్లో నోట్ల కట్టలు

  • ఏళ్లుగా తిరుమలలో ఒంటరిగా జీవనం
  • తిరుపతి శేషాచలనగర్‌లో ఇల్లు కేటాయించిన టీటీడీ
  • ఏడాది క్రితం మృతి చెందడంతో ఇల్లు స్వాధీనం
  • బయటపడ్డ రూ.6.15 లక్షల నగదు 


తిరుపతి(రవాణా), మే 17: శ్రీవేంకటేశ్వరస్వామి తిరునామాలు దిద్దుకుంటూ తిరుమలలో జీవనం సాగించిన ఓ ఒంటరి వ్యక్తి ఇంటిలో కరెన్సీ కట్టలు లభించాయి. యాచకుడి మాదిరే జీవనం సాగించిన అతడి ఇంటిలో ఏకంగా రూ.6.15 లక్షలు లభించాయి. తిరుపతిలో సోమవారం వెలుగుచూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే... .శ్రీనివాసన్‌ అనే వ్యక్తి ఏళ్ళుగా తిరుమలలో తిరునామాలు దిద్దుకుంటూ జీవనం సాగించేవాడు. అతనికి తిరుపతి సమీపంలోని శేషాచలనగర్‌లో ఓ ఇంటిని కూడా టీటీడీ కేటాయించింది. మరణానంతరం ఆ ఇల్లు టీటీడీకే చెందేలా శ్రీనివాసన్‌ వీలునామా రాయించాడు. ఏడాదిన్నర క్రితం శ్రీనివాసన్‌ మృతి చెందడంతో వీలునామా ప్రకారం టీటీడీ అధికారులు అతడి ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు సోమవారం శ్రీనివాసన్‌ ఇంటికి అధికారులు వచ్చారు. వస్తువులను తీస్తున్న సమయంలో నోట్ల కట్టలు కనబడ్డాయి. దీంతో ఆశ్చర్యానికి గురైన సిబ్బంది ఆ నోట్ల కట్టలను లెక్కించారు. ఆ మొత్తం రూ. 6.15లక్షలుగా తేలినట్లు సమాచారం. అయితే శ్రీనివాసన్‌ ఇంటి నుంచి ఎంత నగదు, ఏ వస్తువులు సేకరించారన్నది అధికారికంగా టీటీడీ వెల్లడించాల్సి ఉంది. శ్రీనివాసన్‌ ఇంటిలో లభించిన నగదును అధికారులు టీటీడీ ఖజానాకు తరలించారు.

Updated Date - 2021-05-18T09:17:13+05:30 IST