ఏకగ్రీవాలకు 100 కోట్ల నజరానా!
ABN , First Publish Date - 2021-02-25T09:00:01+05:30 IST
ఏకగ్రీవమైన పంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం నుంచి రూ.100 కోట్లకు పైగానే నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. పంచాయతీలకు ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగితే భారీ నజరానా ఇస్తామని ఎన్నికలకు ముందే ప్రభుత్వం
అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఏకగ్రీవమైన పంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం నుంచి రూ.100 కోట్లకు పైగానే నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. పంచాయతీలకు ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగితే భారీ నజరానా ఇస్తామని ఎన్నికలకు ముందే ప్రభుత్వం ప్రకటించింది. రెండు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవమైతే రూ.5 లక్షలు.. 5 వేల లోపు జనాభా ఉన్నవాటికి రూ.10 లక్షలు, 10 వేల లోపు జనాభా ఉన్నవాటికి రూ.15 లక్షలు, 10 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైతే రూ.20 లక్షలు ఇస్తామని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 2,197 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా పంచాయతీల జనాభా బట్టి ఏటా సగటున ఒక్కో జిల్లాకు రూ.10 కోట్లకు పైగానే అందుతాయని అంచనా. కడప జిల్లాలో అత్యధికంగా 258 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. రూ.20.65 కోట్లు నజరానాగా ఇవ్వాల్సి ఉంది. ప్రకాశం జిల్లాలో 206 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వాటికి రూ.12.30 కోట్లు.. కర్నూలు జిల్లాలో 161 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. రూ.11.25 కోట్లు బహుమతిగా అందాల్సి ఉంది.
పంచాయతీలకు 656 కోట్ల ఆర్థిక సంఘం నిధులు
పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. 2020-21కి సంబంధించి ఇప్పటికే మొదటి విడత విడుదల కాగా.. తాజాగా రెండో విడత మౌలిక గ్రాంట్ కింద రూ.656 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది.