ఇంటర్ పరీక్షల్లో చూచిరాత
ABN , First Publish Date - 2020-03-13T10:05:22+05:30 IST
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో విద్యార్థులు ఎంచక్కా నకలు కొట్టారు. గురువారం గణితం, జంతుశాస్త్రం (జువాలజీ), చరిత్ర పరీక్ష నిర్వహించగా..

షాద్నగర్ రూరల్, మార్చి 12: ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో విద్యార్థులు ఎంచక్కా నకలు కొట్టారు. గురువారం గణితం, జంతుశాస్త్రం (జువాలజీ), చరిత్ర పరీక్ష నిర్వహించగా.. విద్యార్థులు క్వశ్చన్ బ్యాంకులను తమ ముందు పెట్టుకొని ప్రశ్నలకు జవాబులు రాశారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం మొగిలిగిద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చోటు చేసుకుందీ సంఘటన. మాస్కాపీయింగ్ యథేచ్ఛగా జరుగుతున్నా అధ్యాపకులు, ఇతర అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం విస్మయం కలిగిస్తోంది. కొన్నాళ్లుగా మొగిలిగిద్ద జూనియర్ కళాశాల సెంటర్లో పరీక్షలు రాసిన విద్యార్థుల ఉత్తీర్ణ శాతం ఎక్కువగా ఉంటోంది. దానిపై అనుమానించిన పలు ప్రైవేటు కళాశాలల యజమానులు, కొంతమంది వ్యక్తులు మొగిలిగిద్ద కళాశాలలో మాస్కాపీయింగ్ జరుగుతోందని ఇంటర్బోర్డుకు ఫిర్యాదులు కూడా చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి జరిగే పరీక్షలకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.