భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలి
ABN , First Publish Date - 2020-12-20T04:18:15+05:30 IST
భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలి

మండల స్థాయి క్రీడల్లో ఏఎస్పీ గౌస్ ఆలం
ఏటూరునాగారం, డిసెంబరు 19: యువతీ యువకులు చెడు మార్గాలను విడనాడి తమ భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలని ఏఎస్పీ గౌస్ ఆలం సూచించారు. మేడారం ట్రైబల్ స్పోర్ట్స్ మీట్-2021 సన్నాహాల్లో భాగంగా ఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ ఆదేశాల మేరకు ఏటూరునాగారంలోని జంబోరి క్రీడా మైదానంలో శనివారం మండల స్థాయి వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ క్రీడలు ప్రారంభమయ్యాయి. మండలం నుంచి వాలీబాల్ టీంలు 26, కబడ్డీ టీంలు 14, ఖోఖో టీంలు 6, అథ్లెట్లు 20 మంది పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఏఎస్పీ గౌస్ ఆలం హాజరై శుభసూచికంగా పావురాన్ని ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు. క్రీడాకారులతో కబడ్డీ ఆడి అలరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహ పడకుండా రేపటి గెలుపు కోసం కష్టపడాలన్నారు. సీఐ సట్ల కిరణ్కుమార్, ఎస్సై నూనెగంటి శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోని క్రీడాకారుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ క్రీడలు ఎంతో దోహదపడుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఈసం రాంమ్మూర్తి, దొడ్డ కృష్ణ, వంక దేవేందర్, రమాదేవి, రమేష్, పీఈటీలు శ్రీనివాస్, సతీష్, రమేష్, రవి, శామ లత, స్వరూప, అవంతిక, రామయ్య, కుమారస్వామి, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.