హైదరాబాద్లో యువకుడి దారుణ హత్య
ABN , First Publish Date - 2020-09-24T11:50:58+05:30 IST
బాలాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. వాదియే
హైదరాబాద్/పహాడిషరీఫ్ : బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధి వాదియే ముస్తఫాలో మంగళవారం అర్ధరాత్రి ఓ యువకుడిపై కొందరు దాడి చేయగా ఉస్మానియా ఆస్పత్రిలో చనిపోయాడు. బాలాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. వాదియే ముస్తఫాకు చెందిన సయ్యద్ మోమీన్ అలీ(24) స్నేహితులతో కలిసి మరో స్నేహితుడైన ఫర్హాన్ ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మోమీన్ అలీపై కత్తులతో దాడి చేసి పారిపోయారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు వచ్చి తీవ్రంగా గాయపడిన యువకుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో అతడు మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఆర్థిక లావాదేవీలే కారణం..
మోమీన్ అలీపై దాడికి ఆర్థిక లావాదేవీలే కారణమై ఉండవచ్చునని స్థానికులు భావిస్తున్నారు. ఇక్కడి బస్తీల్లో కొందరు యువకులు రాత్రి పూట తిష్ట వేసి మద్యం, గంజాయి, హుక్కా సేవిస్తూ శాంతిభ్రదతలకు విఘాతం కల్పిస్తున్నారని అంటున్నారు. వాదియే ముస్తాఫాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.