వరదలకు దెబ్బతిన్న ‘ఏడుపాయల’ ఆలయం
ABN , First Publish Date - 2020-10-21T10:29:58+05:30 IST
మెదక్ జిల్లా ఏడుపాయలలో మంజీరా నది వరద ఉధృతికి వనదుర్గామాత ఆలయానికి భారీ నష్టం వాటిల్లింది.

6 రోజుల అనంతరం జల దిగ్భంధం నుంచి విముక్తి
పాపన్నపేట, అక్టోబరు 20: మెదక్ జిల్లా ఏడుపాయలలో మంజీరా నది వరద ఉధృతికి వనదుర్గామాత ఆలయానికి భారీ నష్టం వాటిల్లింది. 5 రోజులుగా జల దిగ్భంధంలోనే ఉన్న ఆలయ మండపం, పరిసర ప్రాంతాలు దుర్గంధభరితంగా మారాయి. మండపంలో ఆలయ గర్భగుడి ప్రధాన ద్వారం చెత్తతో నిండిపోయింది. మండపం చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్స్ వరదకు కొట్టుకుపోయాయి. వీఐపీ దర్శనానికి వెళ్లే మార్గానికి ఇరువైపులా అమర్చిన స్టీల్ రెయిలింగ్, మండపంలోని ప్రత్యేక దర్శనానికి వెళ్లే క్యూలైన్లు ధ్వంసమయ్యాయి. ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన 15 స్నానపు గదులు ఆనవాళ్లు లేకుండాపోయాయి. ఇటీవల ఆలయ ప్రాంతంలో నిర్మించిన మరుగుదొడ్లకు వెళ్లే పైపులైన్ పత్తా లేకుండా పో యింది. నూతనంగా నిర్మింతమై ఇంకా ప్రారంభానికి నోచుకోని యాగశాల మెట్లు, మెట్లకు ఇరువైపులా వేసిన స్టీల్ రేలింగ్ గ్రీల్స్ వరదలో కొట్టుకుపోయాయి.
ఆల యం ఎదుట ఉన్న రెండు వంతెనలకు ఇరువైపులా ప్రమాదాలు జరుగకుండా వేసిన ఇనుప గ్రీల్, మండపం ఎదుట భాగంలో భక్తుల నీడ కోసం వేసిన రేకులు, జాతర సమయంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు వరదలో కలిసిపోయా యి. రాజగోపురం నుంచి అమ్మవారి ఆలయం వరకు వేసిన సీసీ రోడ్డు సైతం కొం త భాగం వరదలో కొట్టుకుపోయింది. మంగళవారానికి వరద తగ్గిపోయింది. వరదల ప్రవాహంతో ఆలయానికి సంబంధించి సుమారు రూ. 25 నుంచి 30 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఆలయ ఈవో సార శ్రీనివాస్ తెలిపారు.