వైసీపీ నేత పీవీపీ అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-06-25T08:26:04+05:30 IST

ఓ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి, సామాన్లు ధ్వంసం చేయడంతోపాటు యజమానిపై దాడికి యత్నించిన వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్‌

వైసీపీ నేత పీవీపీ అరెస్ట్‌

బంజారాహిల్స్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఓ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి, సామాన్లు ధ్వంసం చేయడంతోపాటు యజమానిపై దాడికి యత్నించిన వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 14లో ప్రేమ్‌ పర్వత్‌ విల్లాస్‌ పేరిట పీవీపీ నిర్మాణాలు చేశారు. ఇందులో ఓ విల్లాను నాలుగు నెలల క్రితం విక్రమ్‌ కైలాస్‌ కొనుగోలు చేశారు. ఆ విల్లాను మరింత ఆధునికీకరించేందుకు విక్రమ్‌ పనులు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం పీవీపీ కొంత మంది అనుచరులతో కలిసి ఆ విల్లా దగ్గరకు వచ్చారు. అక్కడ నిర్మాణ సామగ్రిని దించుతున్న వారిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న విక్రమ్‌ అక్కడికి చేరుకొని ఏమైందని ప్రశ్నించగా.. తాను విల్లాను ఎలా అమ్మానో అలాగే ఉంచాలని, ఆధునికీకరించడానికి వీల్లేదని పీవీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేగాక విక్రమ్‌ ఇంట్లోకి  అక్రమంగా ప్రవేశించి, సామాన్లను ధ్వంసం చేశారు. చంపేస్తానని బెదిరించారు. బాధితుడు వెంటనే బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చినప్పటికీ పీవీపీ ఆగలేదు. దీంతో బాధితుడు బంజారాహిల్స్‌ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనను చంపేస్తానని బెదిరించాడని, పీవీపీ వల్ల తనకు ప్రాణహాని ఉందని, అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పీవీపీపై ఐపీసీ 447, 427, 506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బంజారాహిల్స్‌ ఏసీపీ కేఎస్‌ రావు.. పీవీపీని విచారణకు పిలిపించారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం ఈ కేసులో పీవీపీని అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ కేసులో మరో 9 మందిని నిందితులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-06-25T08:26:04+05:30 IST