కన్నవారి ఫొటోకు చెప్పుల దండ

ABN , First Publish Date - 2020-12-16T07:46:41+05:30 IST

ఆస్తిని రాసివ్వమని అడిగితే తల్లిదండ్రులు తాత్సారం చేస్తున్నారనే కోపంతో ఇద్దరు కుమారులు దారుణంగా వ్యవహరించారు. కన్నతల్లిదండ్రులు అనే స్పృహ

కన్నవారి ఫొటోకు చెప్పుల దండ

బలవంతంగా ఆస్తి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఇద్దరు కుమారులు.. 

తల్లి ఫిర్యాదుతో అదుపులోకి 

సూర్యాపేట క్రైం, డిసెంబరు 15: ఆస్తిని రాసివ్వమని అడిగితే తల్లిదండ్రులు తాత్సారం చేస్తున్నారనే కోపంతో ఇద్దరు కుమారులు దారుణంగా వ్యవహరించారు. కన్నతల్లిదండ్రులు అనే స్పృహ కూడా లేకుండా వారి ఫొటోకు చెప్పుల దండ వేసి అవమానించారు. పైగా తండ్రిని బలవతంగా కారులో తీసుకెళ్లి ఆస్తులను తమ పేరిట రాయించుకున్నారు.


సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన రవీందర్‌, దయాకర్‌ అనే వ్యక్తులదీ దురాగతం. పట్టణానికి చెందిన రిటైర్డ్‌ తహసీల్దార్‌ నూనె సంజీవరావు, సరోజ దంపతులకు రవీందర్‌, దయాకర్‌తో పాటు మరో కుమారుడు, కుమార్తె ఉన్నారు. దయాకర్‌, కరుణాకర్‌ ప్రభుత్వ ఉద్యోగులు. కరుణాకర్‌.. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. సంజీవరావుకు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో సాగు భూములు, హైదరాబాద్‌లో ఓ ప్లాటు ఉంది. కుమార్తెకు వివాహం జరిపించిన సంజీవరావు దంపతులు, సూర్యపేటలోనే చిన్నకుమారుడైన కరుణాకర్‌ వద్ద ఉంటున్నారు.


వారసత్వంగా రావాల్సిన భూమిని తమపేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ రవీందర్‌, దయాకర్‌ కొన్నాళ్లుగా సంజీవరావుపై ఒత్తిడి తెస్తున్నారు ఈ క్రమంలో సంజీవరావు భార్య సరోజ మంగళవారం రవీందర్‌, దయాకర్‌పై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరూ తాము కలిసి దిగిన ఫొటోకు చెప్పుల దండ వేసి అవమానించారని, పెద్ద కుమారుడు రవీందర్‌, అతడి కుమారులైన ప్రశాంత్‌, భాస్కర్‌ కలిసి.. తన  భర్తను బలవంతంగా వాహనంలో తీసుకువెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు.




పోలీసులు తిరుమలనగర్‌లోని రవీందర్‌ ఇంటికి వెళ్లి విచారించగా, తమ తండ్రి నుంచి బలవంతంగా ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు అంగీకరించారు. రవీందర్‌, దయాకర్‌, ప్రశాంత్‌, భాస్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు. 


Updated Date - 2020-12-16T07:46:41+05:30 IST