ప్రపంచం మెచ్చిన గమ్యస్థానం హైదరాబాద్: కేటీఆర్
ABN , First Publish Date - 2020-09-16T21:16:35+05:30 IST
ప్రపంచం మెచ్చిన గమ్యస్థానం హైదరాబాద్ అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ప్రతి నెలా జీహెచ్ఎంసీకి రూ.78 కోట్లు, ఇతర మున్సిపాలిటీలకు రూ.70 కోట్లు ఇస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్: ప్రపంచం మెచ్చిన గమ్యస్థానం హైదరాబాద్ అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ప్రతి నెలా జీహెచ్ఎంసీకి రూ.78 కోట్లు, ఇతర మున్సిపాలిటీలకు రూ.70 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో బస్తీ దవాఖానాలను 350కి పెంచుతామని కేటీఆర్ ప్రకటించారు. త్వరలో జవహర్నగర్లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ నెలకొల్పుతామని చెప్పారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో హైదరాబాద్ కీలకంగా ఉందని, తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ అభివృద్ధి కోసం.. రూ.67 వేల కోట్లకుపైగా ఖర్చు చేశామని, రూపాయికే ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తున్నామని కేటీఆర్ ప్రకటించారు.
‘‘నూతన మున్సిపల్ చట్టం ద్వారా అనుమతుల్ని సులభతరం చేశాం. అన్ని మున్సిపాలిటీల్లో మౌలికసదుపాయాలు కల్పిస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. భవిష్యత్లో డీఆర్ఎఫ్ బృందాలను మరిన్ని నగరాలకు విస్తరిస్తాం. పట్టణాల్లో భారీ ఎత్తున పబ్లిక్ టాయిలెట్స్ని నిర్మిస్తున్నాం. హైదరాబాద్ అభివృద్ధి మొత్తం తామే చేసినట్లు భట్టి చెప్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కది ఊకదంపుడు ఉపన్యాసం. ప్రపంచంలోనే హైదరాబాద్ మోస్ట్ డైనమిక్ సిటీ అని జేఎల్ఎల్ చెబుతుంటే.. కాంగ్రెస్ నేతలకు ఎందుకు కడుపు మండుతోంది? భట్టికి అవకాశం ఇస్తే గోల్కొండ, చార్మినార్ మేమే నిర్మించామంటారు. గాంధీభవన్కు టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సిన రోజు వచ్చింది. ప్రపంచంలోనే 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్బండ్ దగ్గర నిర్మిస్తాం’’ అని కేటీఆర్ ప్రకటించారు.