అటవీ శాఖలో ఉన్నత, సాంకేతిక విద్య అభ్యసించిన వారు అవసరం
ABN , First Publish Date - 2021-01-01T00:33:24+05:30 IST
ఉన్నత, సాంకేతిక విద్య అభ్యసించిన వారు అటవీ శాఖ ఉద్యోగాల్లో చేరటం ఆహ్వానించదగిన పరిణామమని కేంద్ర అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (రీజనల్ ఆఫీస్- చెన్నై)
హైదరాబాద్: ఉన్నత, సాంకేతిక విద్య అభ్యసించిన వారు అటవీ శాఖ ఉద్యోగాల్లో చేరటం ఆహ్వానించదగిన పరిణామమని కేంద్ర అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (రీజనల్ ఆఫీస్- చెన్నై) హేమంత్ కుమార్ అన్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం అటవీ, వన్య ప్రాణుల రక్షణ కోసం వినియోగించటం ద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చు తెలిపారు.
అటవీ రక్షణ, పునరుజ్జీవ చర్యల పై అరణ్య భవన్ లో రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ అటవీ శాఖ వర్కింగ్ ప్లాన్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. వివిధ రకాల టెక్నికల్ అప్లికేషన్ల పనితీరు, అమలు చేస్తున్న విధానంపై ఈ సమీక్షా సమావేశం జరిగింది. డీజీపీఎస్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, జియో ట్యాగింగ్, జియో ఫెన్సింగ్, లైడార్ సర్వే, ఈ-గ్రీన్ వాచ్, హరిత పథ్, అప్లికేషన్ ఆఫ్ బయో టెక్నాలజీ ఇన్ ఫారెస్ట్రీ లాంటి అప్లికేషన్లను క్షేత్ర స్థాయిలో అమలు చేస్తున్న విధానం, ఫలితాలపై సమావేశంలో చర్చించారు.
వివిధ జిల్లాల్లో అమలు చేస్తున్న అప్లికేషన్లపై తమ అనుభవాలను రేంజ్, బీట్, సెక్షన్ అధికారులు ప్రజంటేషన్ ద్వారా వివరించారు. మొక్కలు నాటిన ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేయటం ద్వారా వాటి పర్యవేక్షణ సులువు అవుతుందని, డూప్లికేషన్ ను నివారించవచ్చని తెలిపారు. ఇక అటవీ ప్రాంతాలను జియో ఫెన్సింగ్ చేయటం ద్వారా ఆయా ప్రాంతాల్లో చొరబాట్లను నిరోధించటం, అటవీ జంతువుల కదలికలను కూడా పసిగట్టవచ్చని అధికారులు తెలిపారు.
కంపా నిధులను జవాబుదారీతనంతో పాటు, పారదర్శకంగా సద్వినియోగం చేసేందుకు ఈ గ్రీన్ వాచ్ ఉపయోగపడుతుందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) ఆర్.శోభ తెలిపారు. తెలంగాణ అటవీ శాఖలో ఇటీవల చేరుతున్న ఉద్యోగులు ఉన్నత విద్యను అభ్యసించటంతో పాటు, సాంకేతికంగా మంచి పట్టు ఉన్నవారు కావటంతో మరిన్ని మంచి ఫలితాలు రాబడతామని పీసీసీఎఫ్ తెలిపారు. క్షేత్ర స్థాయి సిబ్బంది వాడుతున్న అప్లికేషన్ల వివరాలు, కొత్త టెక్నాలజీతో అనుసంధానం, ఫలితాల విశ్లేషణపై సమావేశంలో చర్చించారు. ఈ నివేదికలను హేమంత్ కుమార్ జాతీయ స్థాయిలో పనిచేస్తున్న సీనియర్ అటవీ అధికారులకు పంపారు.