పిల్లలతో కలిసి నిద్రాపోదామంటే భర్త పట్టించుకోలేదని..
ABN , First Publish Date - 2020-03-16T13:42:33+05:30 IST
పిల్లలతో సహా అందరం ఒకేచోట నిద్రపోదామంటే భర్త పట్టించుకోలేదని
- మహిళ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్/కొత్తపేట : పిల్లలతో సహా అందరం ఒకేచోట నిద్రపోదామంటే భర్త పట్టించుకోలేదని ఓ మహిళ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఎల్బీనగర్ ఎస్హెచ్వో అశోక్రెడ్డి కథనం ప్రకారం.. కార్పెంటర్గా పనిచేస్తున్న రవికాంత్(30), నాగరాణి(26) దంపతులు నాగోల్ ఫతుల్లగూడలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు రూస్(5), మిన్ను(2). భార్యాభర్తలిద్దరికీ తరచూ గొడవలు జరుగుతుండేవి.
శనివారం రాత్రి 10.30 గంటలకు రవికాంత్ పిల్లలిద్దరితో కలిసి హాల్లో నిద్రపోతున్నాడు. అందరం బెడ్రూమ్లో నిద్రపోదామని నాగరాణి చెప్పింది. భర్త పట్టించుకోకపోవడంతో క్షణికావేశానికి లోనైన ఆమె టర్పెంటాయిల్ శరీరంపై పోసుకొని నిప్పంటించుకుంది. కేకలు వేయడంతో భార్యను కాపాడేందుకు రవికాంత్ గదిలోకి వెళ్లి మంటలను ఆర్పుతుండగా అతడు కూడా గాయపడ్డాడు. ఇరుగుపొరుగు వారు 108కి సమాచారం ఇచ్చారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.