భర్తతో తల్లి వివాహేతర సంబంధం.. నవ వధువు ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-03-14T14:31:57+05:30 IST
హైదరాబాద్: తన భర్తతో తల్లి వివాహేతర సంబంధాన్ని కొనసాగించడాన్ని భరించలేని నవ వధువు ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్: తన భర్తతో తల్లి వివాహేతర సంబంధాన్ని కొనసాగించడాన్ని భరించలేని నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ యాదయ్య తెలిపిన మేరకు.. మీర్పేట అల్మాస్గూడకు చెందిన వేలూరి అనిత కొన్నేళ్లుగా భర్త బాబురావుతో విడిపోయి.. క్యాటరింగ్ పనులు చేస్తూ పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ప్రేమ్ నవీన్కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో అతడు తరచూ అనిత ఇంటికి వచ్చేవాడు. ఎలాగైనా శాశ్వతంగా ఇద్దరూ కలిసి ఉండాలన్న ఉద్దేశంతో డిగ్రీ మొదటి సంవత్సరం చదివే తన పెద్ద కుమార్తె వందన(19)ను నవీన్కుమార్కు ఇచ్చి అనిత గత సంవత్సరం డిసెంబరు 1న వివాహం జరిపించింది.
వివాహమైన తరువాత కూడా నవీన్, అనితల వివాహేతర సంబంధం కొనసాగింది. ఇది గమనించిన వందన విడిగా ఉందామని పలుమార్లు భర్తకు చెప్పగా, ఇంట్లో నుంచి వెళ్లిపోతే తాను చనిపోతానని తల్లి అనిత బెదిరించింది. వీరిద్దరి ప్రవర్తన కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురైన వందన గురువారం రాత్రి సూసైడ్ నోట్ రాసి చీరతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి సోదరి సంజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.