క్వారంటైన్ సెంటర్లో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-11-07T07:29:23+05:30 IST
ఓ ఇంటర్నేషనల్ హోటల్లో ఏర్పాటు చేసినకొవిడ్ క్వారంటైన్ సెంటర్లో మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
![క్వారంటైన్ సెంటర్లో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
శంషాబాద్, నవంబరు 6: ఓ ఇంటర్నేషనల్ హోటల్లో ఏర్పాటు చేసినకొవిడ్ క్వారంటైన్ సెంటర్లో మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో శుక్రవారం రాత్రి ఈ సంఘటనచోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉందూరు గ్రామానికి చెందిన నాగరాజు భార్య మంగ (28) ఉపాధికోసం మస్కట్ వెళ్లారు. ఈ నెల 4న మస్కట్ నుంచి తిరిగి వచ్చిన మంగ.. నిబంధనల ప్రకారం క్వారంటైన్ సెంటర్లో ఉన్నారు. ఆమెతో పాటు అదే గదిలో వేరే రాష్ట్రానికి చెందిన మరో యువతి కూడా ఉంటోంది.
కాగా సాయంత్రం తన కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడుతుండటంతో ఆమెతో పాటు ఉన్న మరో యువతి వేరే గదిలోకి వెళ్లింది. కొద్దిసేవటికి ఆ యువతి తిరిగివచ్చే సరికి మంగ ఉరేసుకుంది. సమాచారం అందుకున్న ఎయిర్పోర్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.