రోహింగ్యాలకు ఓటు హక్కు ఇస్తారా!

ABN , First Publish Date - 2020-11-26T07:24:31+05:30 IST

దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యాలకు ఓటు హక్కు ఎలా కల్పిస్తారని టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ పార్టీలను కేంద్ర చేనేత

రోహింగ్యాలకు ఓటు హక్కు ఇస్తారా!

టీఆర్‌ఎస్‌-మజ్లిస్‌ పార్టీల అపవిత్ర పొత్తుకు ఇదే నిదర్శనం

ఒవైసీ..పాతబస్తీని అభివృద్ధి చేయరేం?

కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ

ఒవైసీ.. పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయరు: స్మృతీఇరానీ 

హైదరాబాద్‌, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యాలకు ఓటు హక్కు ఎలా కల్పిస్తారని టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ పార్టీలను కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతీఇరానీ ప్రశ్నించారు. ఓటరు జాబితాలో పేరు చేర్చినందుకు రోహింగ్యాలు సీఎంకు, ఎంఐఎంకు బహిరంగంగానే కృతజ్ఞతలు తెలిపారన్నారు. అక్రమ వలసదారులకు ఓటు హక్కు కల్పించాలని ఎంఐఎం ప్రజాప్రతినిధులు తమ లెటర్‌ హెడ్‌లపై సిఫారసు చేసినట్లు జాతీయ మీడియాలోనూ వచ్చిందన్నారు. ఎంఐఎం చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి ఉండాల్సిందని స్పష్టం చేశారు. టీఆర్‌ఎ్‌స-ఎంఐఎం అపవిత్ర పొత్తుకు ఈ ఘటన నిదర్శనమని స్మృతీ ఇరానీ వ్యాఖ్యానించారు. సగటు భారతీయుడి పక్షాన  నిలవాల్సిన ఈ రెండు పార్టీలు అక్రమ వలసదారుల పక్షాన నిలబడటం సిగ్గుచేటు అని విమర్శించారు.




బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై తమ పార్టీ విడుదల చేసిన చార్జిషీటుపై టీఆర్‌ఎస్‌ ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదని, ఇలా మౌనం వహిస్తే వైఫల్యాలను అంగీకరించినట్లేనని స్పష్టం చేశారు. టీఆర్‌ఎ్‌స-ఎంఐఎం అపవిత్ర పొత్తు లేకుండా నగరంలో 75 వేల ఆక్రమణలు సాధ్యమా? అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి తెలంగాణాకు తన శాఖ నుంచే రూ.2 వేల కోట్ల ప్యాకేజీని మంజూరు చేశామని మంత్రి చెప్పారు.

చిన్నారుల కోసం కేంద్రం ప్రతిపాదించిన వ్యాక్సినేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని, సమగ్ర నివేదిక ఇవ్వకపోవడంతో యువత ఉపాధికి ఉద్దేశించిన సంకల్ప్‌ యోజన పథకం కూడా అమలు కావడం లేదని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ను అమలు చేయడం లేదన్నారు.


పాతబస్తీ హైదరాబాద్‌లో లేదా? అని ప్రశ్నిస్తున్న అసదుద్దీన్‌ ఒవైసీ దాన్ని ఎందుకు అభివృద్ధి చేయడం లేదో చెప్పాని స్మృతీఇరానీ డిమాండ్‌ చేశారు. సరిహద్దుల్లో మన సైనికులు చొరబాట్లను ఎదుర్కొంటుంటే హైదరాబాద్‌లో అక్రమ వలసదారులకు ఎందుకు ఆశ్రయం ఇచ్చారో చెప్పాలన్నారు. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్విపై పోలీసుల బలప్రయోగం టీఆర్‌ఎస్‌ ఓటమికి సంకేతమని స్మృతీఇరానీ పేర్కొన్నారు. 


Updated Date - 2020-11-26T07:24:31+05:30 IST