మద్దతు ధర బాధ్యత ఎవరిది?
ABN , First Publish Date - 2020-12-29T07:00:14+05:30 IST
రాష్ట్రంలో పంట ఉత్పత్తులకు సంబంధించి కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయాలన్న ప్రభుత్వ ఆలోచన.. రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వీలును కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలు కల్పిస్తున్నా కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) పరిస్థితేంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి
ధరల నియంత్రణను పర్యవేక్షించేది ఎవరు?
కొనుగోలు కేంద్రాల
ఎత్తివేతపై రైతుల్లో ఆందోళన
కేంద్ర కొత్త చట్టాల్లో కానరాని ‘నియంత్రణ’ అంశం
ఏజెంట్లు, ట్రేడర్ల ముసుగులో దందాకు అవకాశం
కమీషన్ ఏజెంట్లు, లైసెన్స్ హోల్డర్లు, ప్రైవేటు ట్రేడర్లు.. రైతులకు మద్దతు ధర కల్పించకపోతే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో ఎమ్మెస్పీ అమలు చేయకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. కొన్ని సందర్భాల్లో లైసెన్సులు కూడా రద్దు చేసేవారు. కానీ, కేంద్ర ప్రభుత్వ కొత్త చట్టాల్లోగానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలోగానీ... ఈ రెండు అంశాలు లేవు. రైతులకు, ట్రేడర్లకు మధ్య తగాదాలు వస్తే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ దగ్గర రిపోర్టు చేయాలని మాత్రమే కొత్త చట్టంలో పేర్కొన్నారు. అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగడం రైతులకు సాధ్యమవుతుందా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంట ఉత్పత్తులకు సంబంధించి కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయాలన్న ప్రభుత్వ ఆలోచన.. రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వీలును కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలు కల్పిస్తున్నా కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) పరిస్థితేంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త చట్టాలు రైతు వ్యతిరేకమని, వాటిని వెనక్కి తీసుకోవాలని ఇప్పటివరకు డిమాండ్ చేస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఆ చట్టాలకు అనుకూల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం సీఎం కేసీఆర్ సమక్షంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ‘‘దేశంలో అమలవుతున్న కొత్త చట్టాలు కూడా రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయి. కాబట్టి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు.
’ అని అభిప్రాయం వ్యక్తమైంది. ఈ పరిస్థితుల్లో...‘ఎమ్మెస్పీ’ గ్యారెంటీ ఎవరిస్తారన్నది చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు ఎఫ్సీఐ, నాఫెడ్, మార్క్ఫెడ్, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, స్వయం సహాయక సంఘాలు, పీఏసీఎ్సలు.. ఏ ప్రభుత్వరంగ సంస్థలు పంట ఉత్పత్తులను కొనుగోలు చేసినా రైతులకు కనీస మద్దతు ధర గ్యారెంటీ ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు మార్కెట్ వ్యవస్థను ప్రోత్సహిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం.. రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో విక్రయించుకోవచ్చని, ధర ఎక్కువ ఉంటే ఏఎంసీ బయట కూడా విక్రయించుకోవచ్చని రెండు ఆప్షన్లు ఇచ్చింది. బయటి విషయం పక్కనబెడితే.. మార్కెట్ కమిటీల్లో కొనుగోళ్లకు సంబంధించి, ఎమ్మెస్పీపై ఇటు రైతులకు, అటు మార్కెటింగ్ శాఖ అధికారులకు అనేక సందేహాలున్నాయి. ఽకొత్త చట్టంలో ‘ధరల నియంత్రణ’ అనే అంశాన్ని పొందుపరచకపోవడమే ఇందుకు కారణం.
గతంలో చట్టరీత్యా చర్యలు..
కమీషన్ ఏజెంట్లు, లైసెన్స్ హోల్డర్లు, ప్రైవేటు ట్రేడర్లు.. రైతులకు మద్దతు ధర కల్పించకపోతే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో ఎమ్మెస్పీ అమలు చేయకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. కొన్ని సందర్భాల్లో లైసెన్సులు కూడా రద్దు చేసేవారు. కానీ, కేంద్ర ప్రభుత్వ కొత్త చట్టాల్లోగానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలోగానీ... ఈ రెండు అంశాలు(ధరల నియంత్రణ, ఎమ్మెస్పీ గ్యారెంటీ) లేవు. రైతులకు, ట్రేడర్లకు మధ్య తగాదాలు వస్తే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ దగ్గర రిపోర్టు చేయాలని మాత్రమే కొత్త చట్టంలో పేర్కొన్నారు. కానీ, మెజిస్ట్రేట్ను ఎప్పుడు, ఎలా ఆశ్రయించాలో స్పష్టం చేయలేదు. తొలుత డివిజన్ స్థాయి మెజిస్ట్రేట్ వద్దకు, అక్కడ తేలకపోతే అప్పీలేట్ అథారిటీకి వెళ్లవచ్చని చట్టంలో పేర్కొన్నప్పటికీ.. ఇదంతా రైతులకు సాధ్యమవుతుందా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా కమీషన్ ఏజెంట్లు కొందరు... వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణాల్లోనే పంట ఉత్పత్తులు కొంటామని, రైతులను ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని కొద్దిరోజులుగా కోరుతున్నారు. ఆ విజ్ఞప్తులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష, ప్రకటన ఉండడం గమనార్హం. కానీ, ధరల నియంత్రణ, ఎమ్మెస్పీ గ్యారెంటీ లేకపోతే ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లు, దళారులు, రైస్మిల్లర్లు నిర్ణయించిందే ధర అవుతుందని, వారు లైసెన్సు వ్యాపారుల ముసుగులో దందా చేస్తారనే అభిప్రాయం రైతుసంఘాల నుంచి వ్యక్తమవుతోంది. మార్కెట్ కమిటీల్లో రాష్ట్ర ప్రభుత్వం అమ్మకాలు, కొనుగోళ్లను ప్రోత్సహించినపుడు... కనీస మద్దతు ధర పైనా పర్యవేక్షణ, నియంత్రణ ఉండాలనే డిమాండ్ వస్తోంది.
ఖర్చులు వస్తాయనే గ్యారెంటీ లేదు
ఎమ్మెస్పీ అమలు అంశాన్ని రైతుల ప్రతినిధులతో మౌఖింగా చెబుతున్నారే తప్ప.. చట్టంలో పొందు పరుస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంలేదు. దీంతో ఎమ్మెస్పీని కచ్చితంగా అమలు చేయాలనే బాధ్యత నుంచి కేంద్రం వైదొలిగింది. ఆ చట్టాలపైనే ఆధారపడి ఇష్టమొచ్చినచోట పంట ఉత్పత్తులు అమ్ముకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి తేల్చేశారు. ఈ పరిస్థితుల్లో ఒక క్వింటాలుకు సగటున ఎమ్మెస్పీ కంటే రూ.200 నుంచి రూ.500 తక్కువకు కొనుగోళ్లు జరిగే ప్రమాదం ఉంది. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తే.. రైతులకు ఉత్పత్తి ఖర్చులు వస్తాయనే గ్యారెంటీ కూడా లేదు.
- సారంపల్లి మల్లారెడ్డి, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు