వచ్చేది మా ప్రభుత్వమే
ABN , First Publish Date - 2020-12-15T08:03:53+05:30 IST
రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వమే ఏర్పాటు కాబోతుందని, ఈ పరిస్థితిలో టీఆర్ఎ్సతో పొత్తు అంశమే తలెత్తబోదని, వారితో కలిసే ప్రసక్తే ఉండదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు.
టీఆర్ఎస్తో పొత్తు ఎక్కడిది?.. ‘గులాబీ’తో కలిసే ప్రసక్తే ఉండదు
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టీకరణ
మోదీపై కోపంతో సాగు చట్టాలను కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని ధ్వజం
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వమే ఏర్పాటు కాబోతుందని, ఈ పరిస్థితిలో టీఆర్ఎ్సతో పొత్తు అంశమే తలెత్తబోదని, వారితో కలిసే ప్రసక్తే ఉండదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య సంధి కుదిరిందని, అందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. బీజేపీపై కక్ష, ప్రధాని మోదీపై కోపంతోనే సీఎం కేసీఆర్, నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు.
‘‘మేము హైదరాబాద్లో ఆందోళన చేస్తామంటే ఎక్కడో ఆదిలాబాద్లో నాయకులను సైతం ముందస్తుగా అరెస్టు చేసే పోలీసులు.. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతో పాటు మంత్రులు రోడ్డుపై ధర్నాలు చేసినా ఎందుకు అరెస్టు చేయలేదు’’ అని డీజీపీ మహేందర్రెడ్డిని నిలదీశారు. రైతుల బంద్కు మద్దతు తెలిపిన సీఎం కేసీఆర్.. ఢిల్లీలో రైతులకు సంఘీభావం తెలపకపోవడంపై మీ స్పందన ఏంటన్న ప్రశ్నకు స్పందిస్తూ.. దీనికి కేసీఆరే జవాబు చెప్పాలన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. నూతన వ్యవసాయం చట్టాలను కేంద్రం రూపొందించినా, నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలే ఖరారు చేయాల్సి ఉంటుందని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. మన్మోహన్ హ యాంలోనే అంబానీలు వ్యవసాయ రంగంలోకి ప్రవేశించారని, రిలయన్స్ ఫ్రెష్లు ఎప్పుడొచ్చాయో ఆయనకు తెలియకపోతే తానేమీ చేయలేనని వ్యాఖ్యానించారు. పంజాబ్ తప్ప, దేశంలోని అన్ని రాష్ట్రాలు వ్యవసాయ చట్టాలను స్వాగతిస్తున్నాయని పేర్కొన్నారు.
2 నెలల్లో రామగుండం యూరియా
రూ.6వేల కోట్ల వ్యయంతో పునరుద్ధరించిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో రెండు నెలల్లో ఉత్పత్తి ప్రారంభం కానుందని కిషన్రెడ్డి వెల్లడించారు. కిసాన్ బ్రాండ్ పేరుతో యూరియా అందుబాటులోకి వస్తుందని చెప్పారు.