ఘోర రోడ్డు ప్రమాదం : ఆ మూడు గంటలు ఏమయ్యారు..?
ABN , First Publish Date - 2020-12-15T12:19:40+05:30 IST
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగి
- కారులోకి మందు బాటిళ్లు ఎలా వచ్చాయి..?
- గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం కేసులో.. దర్యాప్తు ముమ్మరం చేసిన సైబరాబాద్ పోలీసులు
హైదరాబాద్ : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగి, ఐదుగురు యువకులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
సీసీటీవీల పరిశీలన
కారులో ఉన్న ఐదుగురు యువకుల్లో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడకపోవడంతో కేసు దర్యాప్తు జఠిలంగా మారింది. దాంతో పోలీసులు మాదాపూర్లో వారు బ యల్దేరిన నుంచి ప్రమాదం జరిగిన సంఘటన వరకు అన్ని ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు పలు విషయాలను గుర్తించారు.
- రాత్రి 9:33కు మాదాపూర్లోని వసతి గృహం నుంచి కారులో బయల్దేరి ర్యాడిసన్ హోటల్కు చేరుకున్నారు.
- రాత్రి 10:30 వరకు అక్కడే ఉన్నారు. ఆసమయంలో అక్కడి నుంచి బయల్దేరారు.
- రాత్రి11:00లకు డీఎల్ఎఫ్ హోటల్ వద్ద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
- రాత్రి11:30లకు బయల్దేరి వారు కారులో ఐఐటీ జంక్షన్ వైపునకు వచ్చారు. ఆ తర్వాత...
- రాత్రి 2:33కు విప్రో జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
అయితే రాత్రి 11:30లకు ఐఐటీ జంక్షన్ వద్ద వారి కారును గుర్తించిన పోలీసులకు.. ఆ తర్వాత వారు ఎక్కడికి వెళ్లారు అనేది అంతు చిక్కడం లేదు. 11:30--2:33 వరకు అంటే సుమారు మూడు గంటలు మృతులు ఎక్కడున్నారు..? ఏం చేశారు..? అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. యువకుల ఫోన్ నంబర్లకు సంబంధించిన కాల్ డేటా రికార్డ్స్ (సీడీఆర్) చెక్ చేస్తున్నారు. వాటి ద్వారా వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయి..?
మృతులు ప్రయాణించిన కారులో పోలీసులకు రెండు మద్యం బాటిళ్లు లభించా యి. వాటిపై ఎలాంటి పేరు లేకపోవడంతో అవి మద్యం బాటిళ్లా..? ఎనర్జీ డ్రింక్స్ బాటిళ్లా...? అనేది తేలాల్సి ఉంది. ప్రమాదం జరిగిన తీరు, అతివేగంతో కారు నడిపిన విధా నం చూస్తుంటే యువకులు మద్యం మత్తు లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఫోరెన్సిక్ రిపోర్టు వస్తేనే..
మృతదేహాలకు ఉస్మానియాలో ఆదివారం పోస్టుమార్టం జరిగింది. మృతులు అతిగా మద్యం సేవించినట్లు కనిపించలేదని డాక్టర్లు చెప్పినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కొన్ని శాంపిల్స్ను ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపినట్లు సమాచారం. ఎఫ్ఎ్సఎల్ రిపోర్టు వస్తేనే మృతులు మద్యం మత్తులో ఉన్నారా..? లేదా..? అనే విషయమై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. కాగా.. ప్రమాదానికి ముందు రాత్రి 11:30 నుంచి రాత్రి 2:33ల వరకు వారు ఎక్కడున్నారో తెలిస్తే కేసులో సగానికి పైగా మిస్టరీ వీడినట్లేనని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.